ప్రపంచ దేశాలను కలవరానికి గురి చేస్తున్న మంకీ పాక్స్ కేసులు మన దేశంలోనూ విస్తరిస్తుండటంతో కేంద్రం అప్రమత్తమైంది. ఇప్పటికే కేరళలో ఒక మంకీ పాక్స్ కేసు నమోదు కాగా, అదే రాష్ట్రంలోని కాన్నురు జిల్లాలో తాజాగా రెండో కేసు వెలుగు చూసింది. కన్నూరు జిల్లాకు చెందిన 31 ఏళ్ల వ్యక్తికి మంకీ పాక్స్ సోకినట్లు కేరళ అధికారులు ప్రకటించారు. ఇతను ఈ నెల 13న దుబాయి నుండి కర్ణాటక లోని మంగళూరు విమానాశ్రయానికి వచ్చాడు. అక్కడి నుండి రోడ్డు మార్గంలో కేరళలోని కన్నూరుకు చేరుకున్నాడు, రెండు రోజుల క్రితం చర్మంపై దద్దుర్లు కనిపించడంతో స్థానిక ఆసుపత్రికి వెళ్లాడు. అతన్ని పరీక్షించిన వైద్యులు మంకీ పాక్స్ లక్షణాలుగా ఉండటంతో అప్రమత్తమై శాంపిల్స్ సేకరించి పుణె లోని వైరాలజీ ల్యాబ్ కు పంపించారు.
అతనికి మంకీ పాక్స్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. అతనికి కన్నూరు జిల్లా పరియారం వైద్య కళాశాలలో చికిత్స అందిస్తున్నారు. అతని ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని, ఆ వ్యక్తితో సన్నిహితంగా మెలిగిన వారిపై దృష్టి పెట్టినట్లు కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు. ఇప్పటికే కేరళలోని కొల్లాం జిల్లాలో తొలి మంకీ పాక్స్ కేసు నమోదు అయ్యింది. ఇప్పుడు తాజాగా మరో కేసు వెలుగు చూడటంతో కేంద్రం అప్రమత్తమైంది. సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది.
విదేశాల నుండి వచ్చే ప్రయాణీకులకు హెల్త్ స్క్రీనింగ్ పరీక్షలు మరింత కఠినంగా నిర్వహించాలని విమానాశ్రయాలు, నౌకాశ్రయాల అధికారులను ఆదేశించింది. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశానికి విమానాశ్రయాలు, ఓడ రేవుల ఆరోగ్య అధికారులు, ఆరోగ్య శాఖ రీజనల్ డైరెక్టర్ లు హజరయ్యారని ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. దేశంలో మంకీ పాక్స్ వ్యాధిని కట్టడి చేసేలా అంతర్జాతీయ ప్రయాణీకులందరికీ కఠిన ఆరోగ్య పరీక్షలు నిర్వహించేలా చూడాలని ఆదేశించినట్లు తెలిపింది.