వైసీపీ పార్టీలో మరొక ఎంపీ అధిష్టానంపై తీవ్ర విమర్శలకు తెగబడ్డాడు. ఇప్పటికే నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు మీడియా ముందు సొంత పార్టీ ఎమ్మెల్యేలు అవినీతి చేస్తున్నారు, అక్రమాలు చేస్తున్నారంటూ ఆరోపణలు చేయడంతో ఆయనకి పార్టీ అధిష్టానం షోకాజ్ నోటీసులు పంపించడం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద హైలైట్ అయ్యింది. అయినా కానీ అవేమీ పట్టించుకోకుండా తాజాగా చిత్తూరు జిల్లాకి చెందిన తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ రావు ఓ కార్యక్రమంలో పాల్గొని ప్రోటోకాల్ పాటించడంలేదని స్థానిక వైసీపీ నాయకులను పార్టీ అధిష్టానాన్ని విమర్శించడం రాష్ట్ర వ్యాప్తంగా పెను దుమారం రేపింది.
తిరుపతి స్మార్ట్ సిటీ పనుల్లో ఇటీవల జరిగిన శంకుస్థాపన లో బల్లి దుర్గాప్రసాద్ రావు ఇంటి పేరును శిలాఫలకంపై ప్రింట్ చేయకుండా ఉండటాన్ని తీవ్రస్థాయిలో ఖండించారు. దీని వెనకాల కుట్ర ఉంది అని పార్టీ అధిష్టానంపై మండిపడ్డారు. ఇదే సమయంలో తిరుపతి స్మార్ట్ సిటీ పనులు కేంద్ర ప్రభుత్వం నిధులతో చేస్తుందని, దీనికి రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేదని… జగన్ సర్కార్ గాలి తీసే విధంగా కామెంట్లు చేశారు. అంతేకాకుండా కరోనా లాంటి విపత్కర సమయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అసలేం బాగోలేదని ఆరోపణలు గుప్పించారు.
దీంతో ఒక్కసారిగా పార్టీ లో ఎంపీల స్వభావంలో ఉన్న కొద్ది మార్పులు రావటంతో ఈ విషయంపై చిత్తూరు పార్టీ ఇంచార్జి వివరణ ఇవ్వాలని జగన్ కోరినట్లు వైసీపీ పార్టీలో టాక్. ఎంపీ దుర్గాప్రసాద్ రావు గతంలో తెలుగుదేశం పార్టీలో కీలకంగా రాణించారు. 28 ఏళ్ల వయసులోనే పదవి చేపట్టిన వాడిగా రికార్డు సృష్టించారు. ముఖ్యంగా చంద్రబాబు కి అత్యంత సన్నిహితుడు గా దుర్గా ప్రసాద్ రావు చిత్తూరు రాజకీయాల్లో మెలగారని ఏపీ రాజకీయాల్లో టాక్ ఉంది. కాగా 2014 ఎన్నికల్లో చంద్రబాబు టికెట్ ఇవ్వకపోవడంతో ఆ తర్వాత వైసీపీ పార్టీలో చేరి 2019 ఎన్నికల్లో తిరుపతి ఎంపీగా పోటీ చేసి గెలవడం జరిగింది. ఇలాంటి తరుణంలో ఒక్కసారిగా రివర్స్ గా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ మరోపక్క కేంద్ర ప్రభుత్వానికి ఫేవర్ గా బల్లి దుర్గాప్రసాద్ రావు వ్యవహరించడం వైసీపీ పార్టీలో పెద్ద హాట్ టాపిక్ అయింది.