ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కులాల సామాజికవర్గాల పరంగా చూసుకుంటే బీసీలు అత్యధికమని అందరికీ తెలుసు. రాజకీయాలు కూడా కులాల పరంగా నేను ఎక్కువగా ప్రజలను ప్రభావితం చేసే రీతిలో జరుగుతాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే రెడ్డి వర్సెస్ కమ్మ అన్నట్టు రాజకీయాలు కులాల చుట్టు నువ్వానేనా అన్నట్టుగా ఉంటాయి. ఈ రెండు కులాల తప్ప మరో సామాజిక వర్గాన్ని రాణించే ప్రసక్తి లేదు అన్నట్టు రాజకీయం నడుస్తుంది. ఈ క్రమంలో బీసీలను ప్రసన్నం చేసుకోవడానికి అధికారంలో ఉన్న వైసీపీ అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్న టిడిపి నానా పాట్లు పడుతున్నాయి. వాస్తవానికి గమనిస్తే బీసీ సామాజికవర్గం ముందు నుండి తెలుగుదేశం పార్టీకి కీలక ఓటుబ్యాంకు.
ఉమ్మడి రాష్ట్రంలో గానీ విభజన జరిగిన తర్వాత వచ్చిన 2014 ఎన్నికలలో బీసీలు టీడీపీ కే ఎక్కువ మొగ్గు చూపారు. కానీ 2019 ఎన్నికల టైం కి సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. వైయస్ జగన్ పాదయాత్ర ఎఫెక్ట్ తో పాటు చంద్రబాబుపై రాష్ట్రంలో వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉండటంతో బీసీలు ఎక్కువగా వైసిపికి మొగ్గు చూపారు. అందువల్లే తెలుగుదేశం పార్టీకి అతి తక్కువ స్థానాలు వచ్చినట్లు ఆ పార్టీలో ఉన్న సీనియర్లు కూడా ఒప్పుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా ప్రస్తుతం అధికారంలో ఉన్న జగన్… బీసీలకు గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా సంక్షేమ పథకాలు ప్రకటిస్తూ..పార్టీలో కీలక పదవులు కూడా వారికి కట్టబెడుతూ ఉండటంతో చాలా వరకు బీసీ వర్గాలకు చెందిన వాళ్లు వైసీపీ కి ఆకర్షితులవుతున్నారు.
ఈ క్రమంలో ఎలాగైనా మళ్లీ బీసీ ఓటు బ్యాంకు కాపాడుకోవాలని, చంద్రబాబు బీసీలకు పెద్దపీట వేసి ఇటీవల కొత్త కమిటీ అధ్యక్ష పదవులను ప్రకటించడం జరిగింది. పరిస్థితి ఇలా ఉండగా ఏపీ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేశన శంకర్ రావు మనకంటూ ఒక కొత్త పార్టీ ఉంటే బాగుంటుందని ఇటీవల బీసీ వర్గాలకు చెందిన నాయకులతో వ్యాఖ్యానించడం ఇప్పుడు సంచలనంగా మారింది. ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీల లో చేరి బీసీ కోటాలో సీట్లు పదవులు పొందటం అనేది అవమానంగా బీసీ నేతలు భావిస్తున్నారు. ఎస్సీ ఎస్టీలకు ఉన్నట్లు అసెంబ్లీ పార్లమెంట్ లో బీసీలకు రిజర్వేషన్లు లేకపోవడంతో….బీసీ కులాల నేతలతో సమావేశాలు అయిన సమయంలో శంకర్ మనకంటూ కొత్త పొలిటికల్ పార్టీ ఉండాలని ప్రకటించడం జరిగింది. దీంతో త్వరలోనే బీసీ వర్గాలకు చెందిన కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ఏపీ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శంకర్ ప్రకటించారు.