ఒడిశాలో రష్యన్ జాతీయుల మిస్టరీ మరణాలు తీవ్ర కలకలాన్ని రేపుతున్నాయి. ఒకే హోటల్ లో ఇద్దరు రష్యన్ జాతీయుల మృతి మరువక ముందే మరో రష్యన్ జాతీయుడు మృతి చెందడం పోలీసులకు ఈ ఘటనలు సవాల్ గా మారుతున్నాయి. రెండు వారాల వ్యవధిలో ముగ్గురు రష్యన్లు మృతి చెందడంతో ఒడిశాలో ఇంతకీ ఏమి జరుగుతోంది అనే ఆందోళన నెలకొంది.
జగత్ సింఘ్ పూర్ జిల్లాలోని పారాదివ్ పోర్టులో ఓ నౌక లో మంగళవారం రష్యన్ జాతీయుడి మృతదేహం లభ్యం అయ్యింది. మృతి చెందింది ఎంబీ అల్ల్నాహ్ షిఫ్ లో చీఫ్ ఇంజనీర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న మిలియా కోవ్ సెర్గే (51) గా పోలీసులు గుర్తించారు. బంగ్లాదేశ్ లోని చిట్టగాంగ్ పోర్టు నుండి ఈ షిప్ పారాదీప్ పోర్టు మీదుగా ముంబై కి వెళుతోంది. షిప్ లోని తన చాంబర్ లో మంగళవారం వేకువజామున మిలియా కోవ్ సెర్గే మరణించినట్లు సమాచారం. సెర్గే మృతికి కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గత నెలలో దక్షిణ ఒడిశాలోని రాయగడ నగరంలోని ఓ హోటల్ నందు ఇద్దరు రష్యాన్ టూరిస్టులు రెండు రోజుల వ్యవధిలో మరణించారు. మృతి చెందిన వారిలో ఒకరు రష్యా చట్ట సభ సభ్యుడు కూడా ఉండటం గమనార్హం. వీరు గతంలో ఉక్రెయిన్ పై రష్యా యుద్దం, అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు వ్యతిరేకంగా మాట్లాడటం, ఆ తర్వాత ఇక్కడ (ఒడిశా)లో మృతి చెందడం చర్చకు దారి తీసింది. రష్యా చట్ట సభ సభ్యుడు పావెల్ అంటోవ్ (65) గత నెల 24న హోటల్ మూడవ అంతస్తు నుండి కిందపడి మృతి చెందారు. అంతకు రెండు రోజుల ముందు డిసెంబర్ 22న ఆయన స్నేహితుడు వ్లాదిమిర్ బిదెనోవ్ (61) హోటల్ గదిలోనే చనిపోయారు. ఈ రెండు కేసులను ఒడిశా పోలీసులు దర్యాప్తు చేస్తున్న క్రమంలోనే మరో రష్యాన్ జాతీయుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం తీవ్ర కలకలాన్ని రేపుతోంది.