గుంటూరు : టిడిపి నేత, మాజీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్కు మరో షాక్ తగిలింది. ఆయన కుమారుడు నిర్వహిస్తున్న గౌతం హోండా షోరూమ్ను శనివారం అధికారులు సీజ్ చేశారు. రాష్ట్రంలో వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత కోడెల కుటుంబ సభ్యుల నిర్వాకాలు ఒకొక్కటి వెలుగు చూశాయి. కె ట్యాక్స్ పేరుతో కుమారుడు, కుమార్తె నిర్వహించిన దందాపై బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేయడంతో వారిపై ఇప్పటి వరకూ 16 కేసులు నమోదు అయ్యాయి. మరో పక్క కోడెల నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ పలువురు టిడిపి నేతలు వేరు కుంపటి పెట్టారు. కోడెల వ్యతిరేక వర్గీయులకు మాజీ ఎంపి రాయపాటి సాంబశివరావు సోదరుడు మద్దతు ఇస్తున్నారు. ఒక పక్క కేసులు, మరో పక్క పార్టీ వ్యతిరేక వర్గీయుల నుండి ఇబ్బందులు ఎదుర్కొంటున్న కోడెలకు మరో సమస్య వచ్చి పడింది.
కోడెల కుమారుడు నిర్వహిస్తున్న రెండు షోరూమ్లలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని రవాణా శాఖ అధికారులు గుర్తించారు. పన్నులు చెల్లించకుండానే అక్రమ మార్గంలో 400 వాహనాలను అమ్మినట్లు అధికారులు గుర్తించారు. కోడెల కుమారుడికి చెందిన గుంటూరు, నరసరావుపేటలలోని రెండు షోరూమ్లను అధికారులు సీజ్ చేశారు.