దుబ్బాక ఉప ఎన్నికలో బిజెపి గెలుపు పట్ల కమలనాథులు కన్నా టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు హ్యాపీగా ఉన్నారట.అయితే తన శత్రువు కెసిఆర్ పార్టీ ఓడిపోయినందుకు కాదు ఆయన సంతోషంగా ఉంది.మరి ఎందుకు అంటారా?అయితే చదవండి!
మొన్నటి ఎన్నికల్లో ఘోరాతిఘోరంగా ఓడిపోయినప్పటినుంచి బీజేపీతో మళ్లీ పొత్తు పెట్టుకునేందుకు చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు.కానీ సానుకూల స్పందన రాకపోవడంతో ఆయన సతమతమైపోతున్నారు.ముఖ్యంగా ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు, పార్టీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి సునీల్ దియోధర్ ఎప్పటికప్పుడు చంద్రబాబు ప్రయత్నాలకు గండికొడుతూ వస్తున్నారు.అయినా ఒంటరిగా పోటీ చేస్తే మళ్లీ పాత ఫలితాలే పునరావృతం అవుతాయని చంద్రబాబుకు బాగా తెలుసు కాబట్టి ఎలాగైనా కమలనాథులను మెప్పించేందుకు ఆయన ప్రయత్నిస్తూనే ఉన్నారు.
ఈ తరుణంలో జరిగిన దుబ్బాక ఉపఎన్నికలో బిజెపి అభ్యర్థి రఘునందన్రావు గెలవడంతో చంద్రబాబు బ్రెయిన్లో మరో మెరుపు మెరిసిందట.త్వరలో జరగనున్న గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికల్లో కూడా విజయం సాధించాలని పట్టుదలతో ఉన్న బిజెపి ఇందుకోసం ఎవరితోనైనా పొత్తు పెట్టుకునే అవకాశాలు ఉన్నాయని చంద్రబాబుకు సమాచారం అందింది. దీన్ని క్యాష్ చేసుకుందామని బాబుగారు ప్రయత్నాలు మొదలెట్టారట.నిజం చెప్పాలంటే గ్రేటర్ హైదరాబాదులో ఇప్పటికీ టిడిపికి కొద్దిగా ఓటు బ్యాంకు ఉంది .ముఖ్యంగా నగరాల్లో సెటిలైన తెలుగువారు, ప్రత్యేకించి ఒక సామాజిక వర్గం చంద్రబాబు పార్టీ వెంట నడుస్తున్నారు.
ఈ పరిస్థితుల్లో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టిడిపితో పొత్తుపెట్టుకుంటే బీజేపీకి మేలు అన్న ఫీలర్స్ ను తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కి చంద్రబాబు పంపుతున్నారట.ఒకవేళ ఇది వర్కవుట్ అయితే తదుపరి ఏపీలో కూడా బీజేపీతో పొత్తుకు మార్గం సుగమం కాగలదన్నది చంద్రబాబు ప్లాన్. ఇప్పటికే చంద్రబాబు జిందగీ దోస్త్ పవన్కల్యాణ్ బీజేపీతో కూటమి గట్టారు.గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కూడా పవన్ కల్యాణ్ జనసేన పార్టీ బరిలోకి దిగనుంది.టిడిపితో పొత్తు విషయంలో పవన్ కల్యాణ్ కూడా బిజెపి నాయకత్వానికి సిఫార్సు చేసే అవకాశాలున్నాయి.శత్రువుకు శత్రువు మిత్రుడు కాబట్టి బిజెపి కూడా టిడిపిని కాదనకపోవచ్చు అంటున్నారు.అయితే తెలంగాణ నుండి మొదలెట్టి ఏపీ వరకూ నరుక్కుంటూ రావాలన్న చంద్రబాబు ప్లాన్ వర్కవుట్ అవుద్దా లేదా అన్నది వేచి చూడాలి!