బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులో ఇప్పటికే ఏపికి చెందిన టీడీపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియతో సహా మరో నలుగురిని అరెస్టు చేసిన పోలీసులు తాజాగా టీడీపీ నేత ఏవి సుబ్బారెడ్డిని అరెస్టు చేశారు. హైదరాబాద్ అయ్యప్ప సొసైటి వద్ద ఏవి సుబ్బారెడ్డిని టాస్క్ పోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ప్రవీణ్ కుమార్ కిడ్నాప్ కేసులో ఏవి సుబ్బారెడ్డిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడిస్తున్నారు.
ప్రవీణ్ కుమార్, ఆయన సోదరుల కిడ్నాప్ కేసులో ఏ 1గా సుబ్బారెడ్డి, ఏ 2గా మాజీ మంత్రి అఖిల ప్రియ, ఏ 3గా అఖిల ప్రియ భర్త భార్గవరామ్ లు ఉన్నారు. వీరిపై ఐపీసీ 448,419,341,342, 506, 366, 149 సెక్షన్ ల కింద కేసు నమోదు చేశారు.
అయితే హఫీజ్పేట భూ వివాదం, కిడ్నాప్ తో తనకు సంబంధం లేదని సుబ్బారెడ్డి పేర్కొంటున్నారు. కిడ్నాప్ కేసులో తనను ఎందుకు చేర్చారో అర్థం కావడం లేదనీ, ప్రవీణ్ కుమార్ కేసుతో తనకు ఏ మాత్రం సంబంధం లేదనీ అన్నారు. గతంలో తనపై హత్యాయత్నం కుట్రకు సంబంధించి అఖిలప్రియపై కేసు పెట్టిన విషయాన్ని గుర్తు చేస్తూ అలాంటి వారితో కలిసి తానెందుకు కిడ్నాప్ చేస్తానని సుబ్బారెడ్డి ప్రశ్నించారు. కాగా అరెస్టు చేసిన అఖిలప్రియకు పోలీసులు గాంధీ ఆసుపత్రికి తీసుకువెళ్లి వైద్య పరీక్షలు చేయించారు. మరి కొద్దిసేపటిలో అఖిలప్రియను న్యాయమూర్తి నివాసంలో పోలీసులు హజరుపర్చనున్నారు.