ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సర్కారులో దేవాలయాల కేంద్రంగా జరుగుతున్న వివాదంలో మరో ఊహించని అంశం తెరమీదకు వచ్చింది.
ఉద్దేశపూర్వకంగా జరుగుతున్నాయా లేదా కాకతాళీయంగా తెలియదు కానీ…లక్షలాది మంది భక్తుల మనోభావాలు తీవ్రంగా గాయపడుతున్నాయి. అదే సమయంలో ప్రతిపక్షాలు సులభంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసే అవకాశం దక్కుతోంది. తాజాగా మరో దేవాలయంలో వివాదం రేగింది. శ్రీకాళహస్తి దేవాలయంలో కొత్త వివాదం జరుగుతోందని తెలుగుదేశం పార్టీ ఆరోపించారు. వైసీపీ ఎమ్మెల్యే మదుసూధన్ రెడ్డి అవినీతిని కట్టడి చేయాలని ముఖ్యమంత్రి జగన్ను కోరుతున్నానని, ముఖ్యమంత్రి కనీసం రెండునిమిషాలైనా కాళహస్తి నియోజకవర్గంపై దృష్టిసారించాలని శ్రీకాళహస్తి టీడీపీ ఇన్ ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి తెలిపారు.
శ్రీకాళహస్తి దేవాలయంలో ఇలా….
శ్రీకాళహస్తి దేవాలయంలో జరిగిన సంఘటన చాలా దారుణమని టీడీపీ ఇన్ ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి తెలిపారు. జూమ్ ద్వారా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన సంచలన కామెంట్లు చేశారు. కాశీలింగం, రామేశ్వరలింగం పక్కనే నంది, శివలింగం ప్రతిష్టించడం, ఒక అనామకుడు దేవాలయంలోకి వెళ్లి, పూజలు నిర్వహించే పరిస్థితిరావడం బాధాకరమని టీడీపీ నేత వాపోయారు. దేవాలయంలో పనిచేసే విజయ్ సారథి, రామూ, ధన్ పాల్ లు ముగ్గురూ వైసీపీకి తొత్తులుగా మారి, దేవాలయంలో ఎన్నడూ చూడని దారుణాలు చేయిస్తున్నారని శ్రీకాళహస్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే పవిత్రమైన కాళహస్తి దేవాలయాన్ని వ్యాపార కేంద్రంగా మార్చాడని, పూజారులనుంచి కూడా సొమ్ము వసూలు చేస్తున్నాడని సుధీర్ రెడ్డి ఆరోపించారు.
వైసీపీ ఎమ్మెల్యే ఇలా చేస్తున్నారట
పవిత్రమైన ఆలయంలో అడుగడుగునా భక్తుల నుంచి లంచాలు వసూలు చేస్తున్నారని శ్రీకాళహస్తి టీడీపీ ఇంచార్జీ ఆరోపించారు. చంద్రబాబునాయుడి హాయాంలో కాళహస్తి నియోజకవర్గానికి తీసుకొచ్చిన 23 పరిశ్రమల యాజమాన్యాలను మామూళ్ల కోసం ఎమ్మెల్యే మదుసూధన్ రెడ్డి బెదిరించాడని ఆరోపించారు. ఆలయ కేంద్రంగా జరుగుతున్న అవినీతి బాగోతంపై కలెక్టర్ పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని సుధీర్ రెడ్డి డిమాండ్ చేశారు. తన మామూళ్లకోసం ఎమ్మెల్యే ఆఖరికి గుడిలోని వారిని కూడా వదలకుండా వసూళ్ల పర్వానికి వినియోగించుకుంటున్నాడని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఎమ్మెల్యేపై సంచలన ఆరోపణలు
నియోజకవర్గంలోని కాంట్రాక్టర్లను బెదిరిస్తూ, వారినుంచి కూడా అందినకాడికి దండుకుంటున్నారని శ్రీకాళహస్తి టీడీపీ ఇంచార్జీ ఆరోపించారు. స్వర్ణముఖి నదిలోని ఇసుక రీచ్ ల నుంచి రోజుకు రూ.2లక్షలవరకు ఎమ్మెల్యేకు అందుతోందన్నారు. ఎమ్మెల్యే బావమరిది శ్రీధర్ రెడ్డి, అక్రమ ఆయుధాలతో భయభ్రాంతులకు గురిచేస్తూ, స్థానికంగా ఉండే ఎమ్ జీఎమ్ హోటల్లో మకాం వేసి, భూ వివాదాలను పరిష్కరిస్తుంటాడన్నారు. ఈ విధంగా కాళహస్తి ఎమ్మెల్యే, ఆయన బావమరిది కలెక్షన్ కింగ్ లుగా మారి, నియోజకవర్గాన్ని అడుగడుగునా లూఠీ చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన దృష్టిని రెండు నిమిషాల పాటు కాళహస్తి నియోజకవర్గంపై పెడితే, ఆయనకు వాస్తవాలు తెలుస్తాయన్నారు. కాగా, తెలుగుదేశం పార్టీ నేత సంచలన ఆరోపణలు, వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, అందులోనూ దేవాలయం కేంద్రంగా జరిగిన నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా స్పందిస్తుంది? ముఖ్యంగా ఎమ్మెల్యే తనపై వచ్చిన ఆరోపణలకు ఎలాంటి వివరణ ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?