హీరోయిన్ గా అనుష్క శెట్టి రేంజ్ ఏంటనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె సోలోగా కొట్టిన హిట్లు అవి సాధించిన వసూళ్లు ఆమె స్థాయిని ఇట్టే చెప్పేస్తాయి. అయితే ఈ మధ్య అనుష్క సినిమాలు బాగా తగ్గించేసింది. ఏడాదికి ఒకటి చేయడం కూడా గగనమైపోతోంది.
2018లో భాగమతి విడుదలయ్యాక అనుష్క సినిమా చేసిందే లేదు. సైరా నరసింహారెడ్డిలో అతిథి పాత్ర మినహా అనుష్క అసలు నటించింది లేదు. ఈ నేపథ్యంలో అనుష్క చేసిన సినిమా నిశ్శబ్దం. పేరుకి తగ్గట్లే ఇదొక థ్రిల్లర్. ఇందులో అనుష్క మ్యూట్ ఆర్టిస్ట్ గా నటించింది. మొదటినుండి దీన్ని అనుష్క సినిమాగానే చూసారు అందరూ.
మాధవన్, అంజలి, షాలిని పాండే తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలో పోషించినట్లు అందరికీ తెలుసు. నిశ్శబ్దం నిన్న రాత్రి అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. అయితే విడుదలైన దగ్గరనుండి ఈ సినిమాకు నెగటివ్ రివ్యూలే వచ్చాయి. అయితే సినిమా చూసిన వాళ్లకు అతిపెద్ద షాక్ అంటే ఇందులో అనుష్క రన్ టైం. నిశ్శబ్దం చూసాక అందరికీ కలిగే అనుమానం ఇందులో హీరోయిన్ అనుష్కనా లేక అంజలినా అని.
ఎందుకంటే ఈ సినిమాలో అంజలి రన్ టైమ్ చూసిన ఎవరికైనా కచ్చితంగా షాక్ తగులుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ లో మొత్తం అంజలి సన్నివేశాలతో నిండిపోయింది. ఇక సెకండ్ హాఫ్ కూడా కేవలం ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ వరకే అనుష్కకు ప్రాధాన్యం. అయితే దీని వెనుక నిర్మాత కోన వెంకట్ హస్తం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కోన వెంకట్ కు అంజలి అంటే ప్రత్యేకమైన అభిమానం ఉంది. తను రైటర్ గా ఉన్న బలుపు చిత్రంలో అంజలి చేత కీలక పాత్ర చేయించాడు. తర్వాత తాను నిర్మాతగా ఉన్న అంజలిని ప్రధాన పాత్రలో పెట్టి గీతాంజలి తీసాడు. ఆ తర్వాత శంకరాభరణంలో కూడా ప్రధాన పాత్ర ఇప్పించాడు. ఇక నిశ్శబ్దంలో కూడా అంజలి పాత్రకే రన్ టైం ఎక్కువ.