అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అతి పెద్ద అవినీతి బాగోతంపై ఇక్కడి అవినీతి నిరోధక శాఖ అధికారులు తెలంగాణ ప్రాంతంలో రహస్య విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆంధ్ర ఏసీబీ అధికారులు తెలంగాణ రాష్ట్రం కోదాడ ప్రాంతంలో విచారణ చేపట్టడం ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం అయింది. ఆంధ్రలో జరిగిన స్కామ్ కు తెలంగాలో విచారణ ఏంటా అని ఆలోచిస్తున్నారా? ఇది చదివితే మీకే అర్ధం అవుతుంది.
ఏపీలో ఈఎస్ఐ అవినీతికి సంబంధించిన కేసులో శాసనసభ టీడీపీ ఉప నేత, మాజీ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన విషయం విదితమే. అయితే అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థితి కారణంగా కోర్టు ఆదేశాల మేరకు ఆయనను ఆసుపత్రికి తరలించారు.
టెలీ హెల్త్ సర్వీసులకు సంబంధించి నిబంధనలను అతిక్రమించి కాంట్రాక్ట్ ఇచ్చారని ఏసీబీ నమోదు చేసిన కేసులో ఏ-1 గా ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ రమేష్కుమార్, ఏ-2గా మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఉన్నారు. ఇప్పటికే ఈ ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది.ఈ కేసులో అప్పటి మంత్రి అచ్చెన్నాయుడు నిందితుడిగా ఉండటం తీవ్ర సంచలనం అయింది.
కాగా ఈ కేసులో A-3గా హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న టెలీహెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి డైరెక్టర్ ప్రమోద్రెడ్డిని చేర్చారు. కోదాడకు చెందిన ప్రమోద్ రెడ్డి..అచ్చెన్నాయుడు అరెస్టయినప్పటి నుండి దగ్గర్నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. సెల్ ఫోన్ స్విచ్చాఫ్ చేసుకున్నారు.
దీంతో ప్రమోద్ రెడ్డి ఆచూకీ కోసం ఆంధ్రా ఏసీబీ అధికారులు కోదాడకు వెళ్లారు. అతడి తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులను రహస్యంగా విచారిస్తున్నట్లు తెలిసింది. ప్రమోద్ రెడ్డి స్వగ్రామమైన అనంతగిరి మండలంలోనూ విచారణ జరిపారట. ఆయన ఆచూకీ కోసం కోదాడ, పరిసర ప్రాంతాల్లో ఆంధ్ర ఏసీబీ అధికారులు నిఘా పెట్టినట్లు తెలుస్తోంది.