ఏపి, తెలంగాణ రాష్ట్రాల మద్య విద్యుత్ బకాయిల పంచాయతీ ఇప్పట్లో తెమిలేదిగా లేదు. మీరు మాకు ఇంత ఇవ్వాలంటే, మీరే అంతకు రెట్టింపు మాకు ఇవ్వాలి అన్నట్లు పేచీ నడుస్తొంది. చాలా కాలంగా తెలంగాణ చెల్లించాల్సిన విద్యుత్ బకాయిల కోసం ఏపి సర్కార్ కేంద్రానికి లేఖలు రాస్తూ వస్తుంది. ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి రాష్ట్రానికి సంబంధించి పలు కీలక సమస్యలతో పాటు విద్యుత్ బకాయిల అంశాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర విద్యుత్ శాఖ మంత్రికి విన్నవించారు. ఈ నేపథ్యంలో కేంద్రం నిన్న తెలంగాణ సర్కార్ కు కీలక లేఖ రాసింది. ఏపికి చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలను లేట్ చార్జీలతో కలిపి నెల రోజుల్లో చెల్లించాలంటూ తెలంగాణ ను కేంద్రం ఆదేశించింది.
కేంద్రం ఇచ్చిన ఆదేశాలపై తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ఫైర్ అయ్యారు. తెలంగాణ పై కేంద్రం కక్షకట్టిందనీ, అందుకే ఇలాంటి ఆదేశాలు జారీ చేసిందని ఆయన ఆరోపించారు. ఇది ముమ్మాటికీ దేశ ద్రేహ చర్యేనని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము చెల్లించాల్సిన దాని కంటే ఏపి తమకు ఇవ్వాల్సిందే ఎక్కువ ఉందని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. ఏపి సంస్థలు తెలంగాణ విద్యుత్ సంస్థలకు రూ.12,941 కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తమకు రావాల్సిన బకాయిలు చెల్లించకపోవడమే కాకుండా పీపీఏ అమల్లోనూ ఏపి తమకు అన్యాయం చేసిందనీ, అయినా సరే కేంద్రం జోక్యం చేసుకోలేదని మంత్రి విమర్శించారు.
వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టేది లేదని సీఎం కేసిఆర్ తెగేసి చెప్పడం వల్లనే కేంద్రం ఈ ఆదేశాలు జారీ చేసిందని మంత్రి జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. ప్రధాని మోడీకి ఏపి రాసిన లేఖలు తప్ప తెలంగాణ లేఖలు కనిపించడం లేదని విమర్శించారు. ఏపికి నెల రోజుల్లోగా బకాయిలు చెల్లించాలని ఆదేశించడం దుర్మార్గమని ఆయన ధ్వజమెత్తారు. విద్యుత్ రంగంలో కేసిఆర్ సాధించిన విజయాలను కేంద్రం జీర్ణించుకోలేకపోతోందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వకుండా అడ్డుకునే కుట్ర ఇందులో కనిపిస్తొందని పేర్కొన్నారు. కృష్ణా, గోదావరి జలాల విషయంలోనూ కేంద్రం ఇలానే వ్యవహరిస్తొందని మంత్రి జగదీశ్ రెడ్డి ఆరోపించారు. ఏపి జెన్ కో కు మొత్తం తెలంగాణ లేట్ పేమెంట్ చార్జీలతో కలిపి రూ.6,756.92 కోట్లు చెల్లించాల్సి ఉండగా, ఇప్పుడు తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి.. తమకే ఏపి సంస్థలు రూ.12,941 కోట్లు చెల్లించాలని తెరపైకి తీసుకురావడంతో ఈ సమస్య ఇప్పట్లో తేలేదిగా లేదని అనుకుంటున్నారు. చూడాలి ఏమి జరుగుతుందో.!
కేంద్రం కీలక ఆదేశాలు.. తెలంగాణకు విద్యుత్ షాక్.. ఏపికి భారీ ఊరట
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?