ap assembly budget session: ఏపి అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారు అయ్యింది. ఈ నెల 20వ తేదీ నుండి సమావేశాలను నిర్వహించనున్నారు. ఈ మేరకు గురువారం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నోటిఫికేషన్ జారీ చేశారు. 2021-22 కు పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. కరోనా నేపథ్యంలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ వర్చువల్ గా ప్రసంగించనున్నారు. బడ్జెట్ సమావేశాలను ప్రభుత్వం ఎన్ని రోజులు నిర్వహిస్తుంది. కోవిడ్ నేపథ్యంలో బడ్జెట్ ప్రవేశపెట్టడం వరకే పరిమితం అవుతుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.
అయితే ఈ సమావేశాలను ఒకటి రెండు రోజుల్లోనే ముగించే అవకాశం ఉందని తెలుస్తోంది. బడ్జెట్ ప్రతిపాదనలను ఆమోదింపజేసుకోవడానికే అసెంబ్లీని సమావేశపరుస్తున్నట్లు సమాచారం. మార్చిలోనే ఈ బడ్జెట్ సమావేశాల్సి ఉన్నప్పటికీ కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం వాయిదా వేసింది. మూడు నెలల కాలానికి అవసరమైన బడ్జెట్ ప్రతిపాదనలను ఆర్డినెన్స్ ద్వారా ఆమోదింపజేసుకున్న విషయం తెలిసిందే. బడ్జెట్ ప్రతిపాదనలను ఆమోదించిన వెంటనే నిరవధికంగా వాయిదా వేస్తారని అంటున్నారు.
తొలి రోజు వర్చువల్ విధానంలో గవర్నర్ ప్రసంగం ఉంటుంది. అనంతరం గవర్నర్ ప్రసంగానికి శాసనసభ, శాసనమండలి ధన్యవాదాలు తెలుపుతాయి. తదుపరి ఇటీవల కాలంలో మృతి చెందిన కడప జిల్లా బద్వేలు ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య, ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డికి సంతాపం ప్రకటిస్తాయి. రెండవ రోజు బడ్జెట్ ప్రతిపాదనలను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సభలో ప్రవేశపెడతారు. దీనిపై చర్చించిన అనంతరం వాటిని ఆమోదిస్తారు.