AP Assembly Budget Session: ఏపి అసెంబ్లీలో టీడీపీ సభ్యులు గందరగోళం సృష్టిస్తున్నారు. జంగారెడ్డిగూడెం కల్తీ సారా మరణాలపై టీడీపీ సభ్యులు ఆందోళన చేస్తూ స్పీకర్ చైర్ వద్దకు దూసుకువెళ్లి పేపర్లు విసురుతూ నిరసన వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ తమ్మినేని సీతారాం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యుల తీరును అధికార పక్షం తీవ్రంగా విమర్శించింది. శవ రాజకీయాలకు టీడీపీ పేటెంట్ తీసుకుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు. ప్రజల కోసం ఎన్టీఆర్ మధ్య నిషేదం తీసుకువస్తే చంద్రబాబు మద్య నిషేదానికి తూట్లు పొడిచారని ఆయన మండిపడ్డారు. సభలో గొడవ చేస్తున్న టీడీపీ సభ్యులను సస్పెండ్ చేయాలని ఎమ్మెల్యే జోగి రమేష్ డిమాండ్ చేశారు.
Read More: AP Assembly Budget Session: ఏపి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..టీడీపీ సభ్యుల ఆందోళన
AP Assembly Budget Session: టీడీపీ సభ్యుల పై స్పీకర్ తమ్మినేని ఆగ్రహం
జంగారెడ్డిగూడెం లో జరిగిన మరణాలను టీడీపీ వక్రీకరిస్తోందని మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. జంగారెడ్డిగూడెంలో జరిగినవి సాధారణ మరణాలనీ, టీడీపీ నేతలు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. జంగారెడ్డిగూడెంలో చంద్రబాబు పర్యటన చేస్తున్నందున టీడీపీ సభ్యుడు అక్కడకు వెళ్లేందుకు సభలో గందరగోళం సృష్టిస్తున్నారని అన్నారు. చంద్రబాబు పాలనలో మద్యాన్ని ఏరులై పారించారనీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. మద్యం బెల్ట్ షాపులు ఎత్తేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చి 40వేల షాపులు తెరిచారని ఆమె దుయ్యబట్టారు. టీడీపీ సభ్యుల తీరును పలువురు సభ్యులు తప్పుబట్టారు. మద్యం పై మాట్లాడే అర్హత టీడీపీ వాళ్లకు లేదని అన్నారు. ప్రశ్నోత్తరాల సమయం సజావుగా జరగకుండా టీడీపీ అడ్డుకుంటోందని దుయ్యబట్టారు. టీడీపీ సభ్యులు ఆందోళన కొనసాగుతున్న క్రమంలో స్పీకర్ తమ్మినేని మరో సారి సభను అయిదు నిమిషాలు వాయిదా వేశారు.
సీఎం జగన్ తో మంత్రులు భేటీ
మరో పక్క ఏపి సీఎం వైఎస్ జగన్ తో మంత్రులు ఆళ్ల నాని, పేర్ని నాని, నారాయణ స్వామి బేటీ అయ్యారు. జంగారెడ్డిగూడెం మరణాలపై సీఎం వద్ద చర్చించారు. మరణాలకు కారణాలను మంత్రి ఆళ్ల నాని, ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామి సీఎంకు వివరించారు. టీడీపీ శవ రాజకీయాలు చేస్తోందని జగన్ పేర్కొన్నారు. వాస్తవ పరిస్థితులు ప్రజలకు తెలియజేయాలని సీఎం జగన్ సూచించారు.