గుంటూరు: అసెంబ్లీ ఫర్నీచర్ వ్యవహారంలో ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమని మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు పేర్కొన్నారు. గుంటూరులో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీ ఫర్నీచర్ విషయంలో రెండు సార్లు అధికారులకు, ఒక సారి స్పీకర్కు లేఖ రాసినా వారి నుండి తగిన స్పందన రాలేదని చెప్పారు. అమరావతి అసెంబ్లీకి సిఆర్డిఎ కొత్త ఫర్నీచర్ సమకూర్చినందున హైదరాబాద్ అసెంబ్లీలోని ఫర్నిచర్ను తన క్యాంపు కార్యాలయానికి అధికారుల అనుమతితోనే తరలించానని కోడెల వివరించారు. ఫర్నిచర్ వెనక్కి ఇస్తాననీ, లేకపోతే వాటి మొత్తానికి సరిపడా డబ్బు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నానని కోడెల మరో సారి తెలిపారు. సెల్ఫోన్లు, మందులు కూడా అమ్ముకున్నట్లు వైసిపి నాయకులు కొందరు తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని కోడెల మండిపడ్డారు. ప్రభుత్వం ప్రజలకు మంచి పాలన అందించకుండా తమపై వేధింపులు సరికాదని కోడెల అన్నారు. గతంలో టిడిపిలో చేరిన వైసిపి ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించినందుకే తనపై ప్రస్తుత ప్రభుత్వం కక్షకట్టిందని కోడెల ఆరోపించారు. తనను వేధించే లక్ష్యంతోనే ఫర్నీచర్ తరలింపు అంశాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారని కోడెల పేర్కొన్నారు.
రాజధానిని మార్చే దిశగా ప్రస్తుత ప్రభుత్వం ఆలోచన చేస్తోందనీ, ఇది ఎంత మాత్రం సరికాదని కోడెల అన్నారు. ఈ విషయంలో జగన్ ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోరాదని కోడెల సూచించారు. నేడు అమరావతి ప్రాంతానికి వెళితే ఒక స్మశానంలో నడిచినట్లుగా ఉందని కోడెల ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజలు జగన్కు అధికారం ఇచ్చింది రాజధాని తరలింపు, పిపిఎల సమీక్ష, పోలవరం పనుల నిలుపుదల, రివర్స్ టెండరింగ్ వంటి పనులు చేయడానికి కాదని కోడెల అన్నారు. నమ్మి ఓట్లు వేసిన ప్రజలకు మంచి పరిపాలన అందించాలని కోడెల సూచించారు.