గుంటూరు : ఏపీ బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ రాష్ట్ర ప్రభుత్వంపై మరోసారి నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపు, బిల్డ్ ఏపీ పేరుతో భూముల అమ్మకంపై ఆయన మంగళవారం గుంటూరులో తన స్వగృహం ఎదురుగా పార్టీ నేతలతో కలసి నిరసన దీక్ష చేపట్టారు.
ఈ సందర్భంగా ఆయన జగన్ ప్రభుత్వ విధానాలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుర్తించారు. ప్రభుత్వంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే జగన్ అనేక విధాలుగా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కరోనా కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతుంటే విద్యుత్ శ్లాబ్లు మార్చారనీ, ప్రజలంతా లాక్డౌన్తో ఇళ్లలో ఉన్న సమయంలో ఇలా చేయడం దుర్మార్గమని అన్నారు.
విద్యుత్ వినియోగదారుల ఏడాది వినియోగం ఆధారంగా గతంలో ఏబీసీ గ్రూపులుగా విభజించారని చెబుతూ నేడు కరోనా లాక్ డౌన్ కారణంగా మధ్య తరగతి ప్రజలు కూడా 225 యూనిట్లుపైగా వినియోగించాల్సి వచ్చిందని అన్నారు. విద్యుత్ బిల్లులు పెంచలేదని ప్రభుత్వం చాలా తెలివిగా చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. శ్లాబ్ మార్పు కారణంగా పేద, మధ్యతరగతి వినియోగదారులు కూడా గ్రూపు సిలోకి మారిపోయారనీ, దీంతో గతంలో కంటే రెండు, మూడు రెట్లు బిల్లులు పెరిగాయని కన్నా అన్నారు.
తాను కూడా మార్చి నెలలో రూ.11,541 వేలు కరెంట్ బిల్లు చెల్లించగా, ఈ నెలలో బిల్లు రూ.20 వేలు దాటిందనీ చెప్పారు. ఈ విధంగా కరెంట్ బిల్లులు వస్తుంటే ప్రభుత్వం మాత్రం బిల్లులు పెంచలేదని ఎలా చెబుతుందని కన్నా ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే అన్ని ధరలు పెంచుతున్నారని విమర్శించారు. ఇప్పుడు ప్రభుత్వ ఆస్తులను అమ్మకానికి పెట్టారనీ దుయ్యబట్టారు. గుంటూరులో మార్కెట్ స్థలాన్ని ఏపీ బిల్డ్ కోసం అమ్మకానికి పెట్టడం దారుణమని అన్నారు. వందలాది మంది మార్కెట్పై ఆధారపడి ఉన్నారనీ గుర్తు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే వృద్ధురాలిపై కేసు పెడతారా.. ఇలా ఎంత మందిని అరెస్టు చేస్తారు అని కన్నా లక్ష్మీనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.