అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి రాష్ట్రంలో ఇడబ్ల్యుఎస్ రిజర్వేషన్ అమలు అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కోరారు. ఈ మేరకు శుక్రవారం ఆయన బహిరంగ లేఖ రాశారు.
ప్రధాని మోది చొరవతో అగ్రవర్ణ పేదలకు విద్య, ఉద్యోగాలలో పది శాతం రిజర్వేషన్ యువతకు వరంగా మారిందని కన్నా అన్నారు. కానీ రాష్ట్రంలో ఇప్పటికీ అమలుకు నోచుకోని నేపథ్యంలో యువత నిరాశకు లోనై అవకాశాలు కోల్పోతున్నారని కన్నా ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం ముఖ్యమంత్రి స్పందించి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్రవర్ణ పేదల రిజర్వేషన్ పది శాతం అమలు అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కన్నా విజ్ఞప్తి చేశారు.
గత కొద్ది రోజులుగా ప్రజా సమస్యలపై ముఖ్యమంత్రి జగన్కు కన్నా వరుస లేఖలు రాస్తున్న విషయం తెలిసిందే.