ఏపి బీజెపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మరో సారి టీడీపీ, వైసీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. గతంలో ఎక్కువగా టీడీపీపైనే విమర్శలు చేసే సోము వీర్రాజు రాష్ట్ర బీజెపీ అధ్యక్షుడుగా నియమితులు అయినప్పటి నుండి అధికార వైసిపీతో పాటు టీడీపీని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. సోము వీర్రాజు టీడీపీకి వ్యతిరేకం అని, వైసీపీకి అనుకూలమని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తాను ఈ రెండు పార్టీలకు వ్యతిరేకం అన్నది చూపించుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఏ అంశంపై మీడియాతో మాట్లాడినా అధికారపక్షం వైసీపీతో పాటు గత పాలన అంటూ టీడీపీపైనా విమర్శల దాడి కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే నేడు సోము వీర్రాజు నంద్యాల ఘటనను పురస్కరించుకుని ఇరుపార్టీలను విమర్శించారు.
నంద్యాలలో ఆటో డ్రైవర్ అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య విషయాన్ని టీడీపీ,వైసీపీలు రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు సోము వీర్రాజు. ఆ కేసులో అక్కడి సీఐ, హెడ్కానిస్టేబుళ్లను అరెస్టు చేయడాన్ని సోము వీర్రాజు తప్పుబట్టారు. తమ డ్యూటీ చేసిన పోలీసులను అరెస్టు చేస్తారా అని ప్రశ్నించారు. ముస్లింల పేరుతో వైసీపీ, టీడీపీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయని అన్నారు. ఈ కేసులో పోలీసులను అరెస్టు చేయడం సరికాదని సోము వీర్రాజు అభిప్రాయపడ్డారు.
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో జరుగుతున్న అక్రమాలపై తాము ప్రశ్నిస్తే తమ పార్టీపై హిందూత్వ ముద్ర వేస్తున్నారని మండిపడ్డారు. తుంగభద్ర పుష్కరాలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, పుష్కర స్నానాలు చేయవద్దని సూచించడం సరికాదని పేర్కొన్నారు. పుష్కర ఘాట్లు నిర్మించనప్పుడు ప్రభుత్వం రూ.200 కోట్లు మంజూరు చేసిందని ప్రశించారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణాలపై ఎత్తు తగ్గిస్తున్నారంటూ టీడీపీ అసత్య ప్రచారం చేస్తుందని సోము వీర్రాజు విమర్శించారు. ప్రాజెక్టు ఎత్తు తగ్గించే ప్రసక్తి లేదనీ, ప్రాజెక్టును కేంద్రమే పూర్తి చేస్తుందని సోము వీర్రాజు స్పష్టం చేశారు. రాష్ట్రంలో యదేశ్చగా ఎర్రచందనం అక్రమ రవాణా జరుగుతోందని, ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ను అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు.