AP Bjp: ఏపీ బీజేపీ పలు కీలక నిర్ణయాలను తీసుకున్నది. విజయవాడలో ఏపి బీజేపీ ముఖ్య నేతల సమావేశం ఆదివారం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి, బీజేపీ ఏపి ఇన్ చార్జి పి మురళీధరన్, జాతీయ సంఘటనా సంయుక్త కార్యదర్శి శివప్రసాద్, జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి, సహా ఇన్ చార్జి సునీల్ ధేవధర్, జాతీయ కార్యదర్శి సత్యకుమార్, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు మాధవ్, విష్ణువర్థన్ రెడ్డి, సూర్యనారాయణరాజు, లోకుల గాంధీ తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో జరిగిన విషయాలను ఎమ్మెల్సీ మాధవ్ మీడియాకు వెల్లడించారు.
రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై చర్చించామన్నారు. వ్యాక్సినేషన్ డ్రైవ్ లో బీజేపీ నాయకులుస, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని నిర్ణయించినట్లు చెప్పారు. జూన్ 21న యోగా దినోత్సవంతో పాటు మరి కొన్ని కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించామన్నారు. జూన్ 28న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు వర్చువల్ పధతిలో నిర్వహించనున్నట్లు తెలిపారు.
వైసీపీ ప్రభుత్వం సంక్షేమం పేరుతో డబ్బులు పంచడమే లక్ష్యంగా పని చేసి రాష్ట్రాన్ని దివాలా తీసిందని విమర్శించారు. ప్రభుత్వం అడ్డదారిలో ఆస్తిపన్నులు పెంచడం సిగ్గుచేటని అన్నారు. ఈ ప్రమాద సమయంలో ప్రజలపై వడ్డన వేయడం అన్యాయమన్నారు. ప్రజలపై పెను భారానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ, జనసేన ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించిందన్నారు. ప్రభుత్వం పెంచిన ఆస్తి పన్ను విరమించే వరకూ ఆందోళన కొనసాగిస్తామని తెలిపారు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. రైతాంగ సమస్యలపై పోరాటాలు చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. రాష్ట్రంలో పార్టీ సంస్థాగతంగా బలోపేతంపై చర్చించామన్నారు. బిల్డ్ ఏపి పేరుతో ప్రభుత్వం ఆస్తులను తనఖా పెట్టడాన్ని సమావేశం వ్యతిరేకించిందన్నారు. పెట్రోల్, గ్యాస్ ధరలు గ్లోబల్ మార్పుల వల్లనే పెరుగుతాయని, పెట్రోల్, డీజిల్ కి జీఎస్టీ తీసేస్తే ధరలు తగ్గుతాయన్నారు. చంద్రబాబు ఎన్ని కుయుక్తులు పన్నినా పొత్తు ప్రసక్తి ఉండదనీ, టీడీపీతో బీజేపీ ఎట్టిపరిస్థితుల్లోనూ కలవదని ఆయన స్పష్టం చేశారు.