విజయవాడ: మహారాష్ట్రలో బిజెపి సుపరిపాలన అందిస్తుందన్న నమ్మకంతో ప్రజలు మెజార్టీ సీట్లు కట్టబెట్టారని మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్ నాయకత్వంలో ప్రభుత్వం మళ్లీ కొలువుతీరడంతో ఏపిలో బిజెపి నేతలు సంబరాలు నిర్వహించారు. విజయవాడలో బిజెపి నేతలు బాణాసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఫడ్నవీస్కు నేతలు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ మిత్రధర్మాన్ని కాలదన్ని బిజెపికి శివసేన నమ్మకద్రోహం చేసిందని విమర్శించారు. ప్రజల నమ్మకాన్ని ఫడ్నవీస్ నిలబెతారని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్సీ మాధవ్ మాట్లాడుతూ శివసేన అధికారదాహంతో నమ్మకద్రోహానికి పాల్పడిందని విమర్శించారు. మహారాష్ట్రలో బిజెపి అద్భుతమైన పాలన అందిస్తుందని పేర్కొన్నారు. సోము వీర్రాజు మాట్లాడుతూ పొత్తుల కారణంగా మహారాష్ట్రలో బిజెపికి సీట్లు తగ్గాయని అన్నారు. మహారాష్ట్ర ప్రజలు బిజెపినే కోరుకుంటున్నారని చెప్పారు. శివసేన తన స్వరూపానికి భిన్నంగా వ్యవహరించిందని వీర్రాజు విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఆలిండియా సంఘటనా ప్రధాన కార్యదర్శి సతీష్, ఏపి కార్యదర్శి మధుకర్, తురగా నాగభూషణం, కంభంపాటి హరిబాబు, రావెల కిషోర్ బాబు, జయప్రకాష్ నారాయణ, పార్థసారధి, అడపా శివనాగేశ్వరరావు, భానుప్రకాష్ రెడ్డి, విల్సన్, శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.