అమరావతి: రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీరు చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్లు ఉందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. జగన్ ప్రభుత్వం అప్రజాస్వామిక విధానాలను అమలు చేస్తుందని ఆరోపిస్తూ శనివారం బిజెపి నేతలు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని పలు సమస్యలను గవర్నర్ హరిచందన్కు వివరించామన్నారు.
ఇసుక కొరత కారణంగా లక్షలాది మంది కార్మికులు బజారున పడ్డా సిఎంలో చలనం లేదని కన్నా ఆరోపించారు. జగన్ పెళ్లికి ముహూర్తం పెట్టినట్లు ఇసుక పాలసీకి సెప్టెంబర్ అయిదు అని పెట్టారని కన్నా వ్యంగ్యంగా అన్నారు. జగన్ మాటలకు చేతలకు పొంతన లేదని కన్నా ఆరోపించారు. ఇసుకను బ్లాక్లో విక్రయిస్తున్నారనీ, పక్క రాష్ట్రాలకు తరలిస్తున్నారనీ కన్నా ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఇడబ్ల్యుఎస్ రిజర్వేషన్లను రాష్ట్రంలో అమలు చేయడం లేదని కన్నా అన్నారు. ఆలయాల భూములను సొంత భూముల్లా తీసుకోవడానికి వ్యతిరేకిస్తున్నామని కన్నాఅన్నారు.