BJP: ఆంధ్రప్రదేశ్ బీజేపీపై కేంద్ర నాయకత్వం సవతి తల్లి ప్రేమ చూపుతోంది. ఇటీవల జరిగిన కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో దేశంలోని అన్ని రాష్ట్రాలలో గల బీజేపీ, భాగస్వామ్యపక్షాల నేతలకు అవకాశం కల్పించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఏపికి చెందిన పార్లమెంట్ సభ్యులకు సహాయ మంత్రి పదవి కూడా ఇవ్వలేదు. కేంద్ర మంత్రి పదవి లేని ఏకైక రాష్ట్రం ఏదైనా ఉంది అంటే ఒక్క ఏపి మాత్రమే. తాజాగా బీజేపీ యువమోర్చా జాతీయ కార్యవర్గంలోనూ ఏపికి మొండి చేయి ఇచ్చింది కేంద్ర నాయకత్వం. పొరుగు రాష్ట్రం తెలంగాణకు యువమోర్చాలో రెండు కీలక పదవులు ఇచ్చిన అధిష్టానం ఏపికి చెందిన ఒక్క నాయకుడికి దానిలో ప్రాతినిధ్యం కల్పించలేదు.
Read More: CBI Court: సీబీఐ కోర్టులో కీలక పరిణామం..! జగన్ బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణ వాయిదా..!!
ఓ పక్క రాష్ట్రంలో విభజన చట్టం హామీలను నెరవేర్చకపోవడం, పోలవరం ప్రాజెక్టు పెండింగ్ నిధుల విడుదల సమస్యతో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అడుగులు ఇలా అనేక విధాలుగా ఏపికి కేంద్రం తీరని అన్యాయం చేస్తుందన్న మాటలు వినబడుతున్న తరుణంలో ఆ పార్టీ రాష్ట్రంలోని నాయకత్వంపైనా సీత కన్ను వేయడం పై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
భారతీయ జనతా పార్టీ యువమోర్చా జాతీయ కార్యవర్గాన్ని బుధవారం ప్రకటించింది. యువమోర్చా విభాగానికి సంబంధించి ఉపాధ్యక్షులు, సహా కార్యదర్శులు, ట్రెజరర్, వివిధ విభాగాల ఇన్ చార్జిలను నియమిస్తూ బీజేపీ ప్రకటన విడుదల చేసింది. జాతీయ యువమోర్చా కార్యవర్గంలో తెలంగాణ నుండి ఇద్దరికి చోటు లబించింది. జాతీయ కార్యదర్శిగా తెలంగాణకు చెందిన షెహాజాదీ సయ్యద్ నియమితులు కాగా యువమోర్చా కోశాధికారిగా సాయి ప్రసాద్ నియమితులైయ్యారు. ఇక పలు రాష్ట్రాల నుండి ఇద్దరు, ముగ్గురు నేతలకు కార్యవర్గంలో చోటు లభించింది. ఏపికి చెందిన నాయకులకు మాత్రం మొండిచేయి ఇచ్చింది. ఈ పరిణామాలతో ఏపి బీజేపీ నేతలకు కేంద్ర నాయకత్వం వద్ద అంతగా పరపతి లేదా లేక వీరు లాబీయింగ్ చేయడంలో విఫలం అవుతున్నారా అన్న మాటలు వినబడుతున్నాయి.