ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులుగా ఎన్నికైన తర్వాత సోము వీర్రాజు వరసగా నేతలను కలుస్తున్నారు. ఇటీవలే ఢిల్లీ వెళ్లి వచ్చిన ఆయన నిన్న మెగాస్టార్ చిరంజీవిని మర్యాదపూర్వకంగా కలిసిన విషయం తెల్సిందే. ఈ సందర్భంగా సోము వీర్రాజును చిరంజీవి అభినందించారు. శాలువాతో సత్కరించారు.
పవన్ కళ్యాణ్ తో కలిసి ప్రయాణిస్తున్నందుకు కృతఙ్ఞతలు తెలిపారు. ప్రజా సమస్యలపై బీజేపీ, జనసేన కలిసి పోరాటం చేయాలని ఆకాంక్షించారు. ఇక ఈరోజు సోము వీర్రాజు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ను కలవడం విశేషం. ఆంధ్రప్రదేశ్ లో జనసేన, బీజేపీ కలిసి పనిచేస్తున్నందున వీరి కలయిక ప్రాధాన్యం సంతరించుకుంది. ఇద్దరి మధ్యా రాజకీయాలకు సంబంధించిన చర్చలు నడిచినట్లు తెలుస్తోంది. భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండాలన్న అంశంలో ఇద్దరూ పలు అంశాల పట్ల ఏకీభవించారు.