టీడీపీ అధినేత చంద్ర బాబు కేంద్రంలోని బీజేపీతో పేచీ పెట్టుకుని ఎన్డీఏ నుండి బయటకు వచ్చిన తర్వాత టీడీపీ తీవ్రంగా నష్టపోయిన సంగతి తెలిసిందే. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి చవి చూసింది టీడీపీ, దీంతో 2024 ఎన్నికల్లో మళ్లీ బీజేపీతో జత కట్టాలని భావిస్తుంది. 2019 ఎన్నికల తర్వాత చంద్రబాబు ఏనాడూ కేంద్రంలోని బీజేపీ సర్కార్ ను విమర్శించిన దాఖలాలు లేవు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లోనూ బేషరతుగా ఎన్డీఏ అభ్యర్ధికి మద్దతు తెలియజేసింది టీడీపీ. బీజేపీతో స్నేహ హస్తం చాటేందుకు టీడీపీ ఉవ్విళ్లూరుతోంది. బీజేపీతో మిత్రపక్షంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాబోయే ఎన్నికల్లో టీడీపీతో కలిసి ప్రయాణించేందుకు సుముఖంగా ఉన్నప్పటికీ బీజేపీ నాయకులు మాత్రం టీడీపీ పొత్తు ప్రసక్తేలేదనీ, జనసేన – బీజేపీ మాత్రమే కలిసి పోటీ చేస్తామని, తామే అధికార పార్టీకి ప్రత్యామ్నాయమని చెబుతున్నారు.
ఏపి బీజేపీలోని పలువురు నేతలు అధికార పార్టీని విమర్శించిన ప్రతి సందర్భంలోనూ గత చంద్రబాబు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు ఇదేమి ఖర్మ రాష్ట్రానికి అంటూ జిల్లాల్లో పర్యటనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ రోడ్ షోల్లో ప్రస్తుతం జగన్ సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఏవీ ఆగవనీ, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వాటిని కొనసాగిస్తామని ప్రజలకు వాగ్దానం చేస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే ప్రస్తుతం జగన్ సర్కార్ అమలు చేస్తున్న నవరత్నాలు ఆగిపోతాయని అధికార పార్టీ నేతలు ప్రజలకు చెబుతుండటంతో చంద్రబాబు తన ప్రసంగంలో సంక్షేమ పథకాల కోసం అప్పులు చేయకుండా సంపద సృష్టించి వాటిని కొనసాగిస్తామని చెబుతున్నారు. ఇలా చంద్రబాబు సంక్షేమ పథకాలను కొనసాగిస్తామని హామీలు ఇస్తుండటంపై ఏపీ బీజేపీ స్పందిస్తూ చంద్రబాబుపై విమర్శల దాడి చేసింది.
అయితే చంద్రబాబుపై బీజేపీ నాయకులు ఎవరూ నేరుగా విమర్శలు చేయకుండా ఏపీ బీజేపీ ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపించింది. అభివృద్ధిని గాలికి వదిలేసి సంక్షేమం పేరుతో నిధులు దారి మళ్లించి ఏపిని సీఎం వైఎస్ జగన్ 90 శాతం నాశనం చేస్తే తాను వంద శాతం నాశనం చేస్తానని మాజీ సీఎం చంద్రబాబు చెప్పడం సిగ్గుచేటని బీజేపీ విమర్శించింది. 2024లో టీడీపీ, వైసీపీలకు బుద్ది చెప్పడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారని పేర్కొంది. ఏపిలో మరీ బరితెగించి చంద్రబాబు వడ్డీతో సహా పాత సంక్షేమ పథకాలను అధికారంలోకి వస్తే మైనార్టీలకు ఇస్తామని చెప్పడం టీడీపీ దివాలాకోరు ఓటు బ్యాంక్ రాజకీయాలకు నిదర్శనమని బీజేపీ విమర్శించింది.
బీజేపీ అభివృద్ధి అజెండాతో గుజరాత్ లో ఏడు సార్లు గెలిచిన ఫలితాలను చూసి ఏపి ప్రాంతీయ పార్టీలు నేర్చుకోవాలని ఏపి బీజేపీ హితవు పలికింది. రాష్ట్రంలో 2024 లో ప్రజలకు పంచడానికి ఏముంది .. హెరిటేజ్ పాలు, భారతి సిమెంట్ కంపెనీల ఆదాయం తప్ప అని ఎద్దేవా చేసింది బీజేపీ. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నర్శింహరావు తదితరులు తరచుగా టీడీపీ పై చేస్తున్న విమర్శలు గానీ, తాజాగా ఏపీ బీజేపీ ట్విట్టర్ వేదికగా చేస్తున్న విమర్శలు గానీ చూస్తుంటే చంద్రబాబు బీజేపీ దరి చేరకుండా ఉండేందుకు ముందరి కాళ్లకు బంధం వేస్తున్నట్లు ఉందని అంటున్నారు.
KCRs BRS: నూతన శాతవాహన సామ్రాజ్యం దిశగా పావులు కదుపుతున్న నయా శాతవాహనుడు సీఎం కేసీఆర్
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?