AP Cabinet : ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గ సమావేశమై పలు కీలక నిర్ణయాలను తీసుకున్నది. ఈబీసీ నేస్తం పథకానికి కేబినెట్ ఆమోదించింది. వచ్చే మూడేళ్లలో 45 నుండి 60 సంవత్సరాలలోపు మహిళా లబ్దిదారులకు ఈ పథకం ద్వారా రూ.45వేలు అందించనున్నారు. పట్టణ ప్రాంతాల్లో టిడ్కో ఇళ్లను 300 చదరపు అడుగుల లోపు ఉంటే..రూపాయికే లబ్దిదారులకు ఇల్లు ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
అమరావతి రాజధాని ప్రాంతంలో ఇప్పటికే 50శాతం నిర్మాణం పూర్తి అయి పెండింగ్ లో ఉన్న భవనాలను పూర్తి చేయడానికి ఏఎంఆర్డీఏకు రూ.3వేల కోట్లకు బ్యాంక్ గ్యారంటీ ప్రభుత్వం ఇచ్చే ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించింది. ఇప్పటికీ ప్రారంభం కాని, కొద్దిగా ప్రారంభమైన నిర్మాణలపై ఇంజనీరింగ్ అధికారుల నివేదిక వచ్చిన తరువాత నిర్ణయం తీసుకోవాలని కేబినెట్ లో అభిప్రాయపడినట్లు సమాచారం. నవరత్నాలు అమలు క్యాలెండర్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది.
కాకినాడ ఎస్ఈజడ్ భూముల వ్యవహారానికి సంబంధించి నివేదికను మంత్రి కన్నబాబు కమిటీ కేబినెట్కు సమర్పించింది. రైతులు ఇచ్చిన 2,180 ఎకరాలను వెనక్కి ఇచ్చేయాలని కమిటీ సూచించింది. వైఎస్ఆర్ స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం భాగస్వామ్య సంస్థ ఎంపికకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అదే విధంగా కడప జిల్లాలో రెండు పారిశ్రామిక పార్కులకు భూ కేటాయింపులపై చర్చ జరిగింది. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతున్న నేపథ్యంలో ఈ అంశంపై కూడా కేబినెట్ చర్చించింది. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది.
కేబినెట్ భేటీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, మంత్రులు బొత్స సత్యనారాయణ, బాలినేని శ్రీనివాసరెడ్డి, కొడాలి నాని, ఆదిమూలపు సురేష్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.