రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈరోజు జరిగింది. ఆ సందర్భంగా కొన్ని కీలక నిర్ణయాలు, కీలక చర్చలు జరిగాయి. మంత్రులు ప్రస్తావించిన అనేక అంశాలపై సీఎం జగన్ సూటిగా నిర్ణయాలు తీసుకున్నారు. దాదాపు రెండున్నర గంటలు సాగిన ఈ సమావేశంలో తీసుకుని కొన్ని కీలక నిర్ణయాలు పరిశీలిస్తే..!!
* రాష్ట్రంలో ఆన్లైన్ రమ్మీ, పోకర్ వంటి జూద క్రీడలపై నిషేధం. ఎవరైనా ఆడుతూ పట్టుబడినా, నిర్వాహకులు మొదటిసారి పట్టుబడితే ఏడాది జైలు, రెండోసారి పట్టుబడితే రెండేళ్ల జైలు, జరిమానా విధింపు. ఈ మేరకు బిల్లు తీసుకురావాలని ఆదేశం. ఆన్ లైన్ జూదం ఆడుతూ పట్టుబడితే ఆరునెలల జైలు.
* వైఎస్సార్ ఉచిత విద్యుత్ నగదు బదిలీ పథకానికి కేబినెట్ ఆమోదం. డిసెంబర్ 1 నుంచి శ్రీకాకుళం జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ఉచిత విద్యుత్ నగదు బదిలీ పథకం అమలు. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉచిత విద్యుత్ నగదు బదిలీ పథకం అమలు చేయడానికి నిర్ణయం. రాష్ట్రంలో ఫీడర్ల అప్గ్రేడేషన్కు రూ.1700 కోట్లు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం. పగటి పూట 9 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉన్న లక్ష అనధికార ఉచిత విద్యుత్ కనెక్షన్ల క్రమబద్ధీకరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. భూమిని కౌలుకిచ్చిన రైతులకూ ఉచిత విద్యుత్ పథకం అమలు చేయాలని నిర్ణయం. విద్యుత్ బకాయిల చెల్లింపు బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలని నిర్ణయం.
కొన్ని కీలక ప్రాజెక్టులకు ఆమోదం..!!
రాష్ట్రంలో అర్హులైన కొందరు ఎండీవోలకు డీడీవోలుగా ప్రమోషన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో స్టేట్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ఏర్పాటుకు అంగీకరించారు. ప్రకాశం బ్యారేజీ దిగువన 3 టీఎంసీల సామర్ధ్యంతో మరో రెండు బ్యారేజీల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. రూ.1350 కోట్ల ఖర్చుతో కృష్ణానదిపై చోడవరం వద్ద బ్యారేజీ నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం. రూ. 1280 కోట్లతో మోపిదేవి వద్ద కృష్ణానదిపై మరో బ్యారేజీ నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.15380 కోట్లతో ఉత్తరాంధ్రలోని మెట్టప్రాంతాల కోసం బాబూజగజ్జీవన్ రామ్ సుజల స్రవంతి పథకం. బాబూజగజ్జీవన్ రామ్ సుజల స్రవంతి పథకంతో 8 లక్షల ఎకరాలకు లబ్ది. రాయలసీమ కరువు నివారణ పథకం కింద 14 పనులకు త్వరిత గతిన పూర్తి చేయాలని నిర్ణయం.
* బాపట్ల, మార్కాపురంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు కోసం స్ధల కేటాయింపుకు కేబినెట్ ఆమోదం.
మావోయిస్టులపై మరో ఏడాది నిషేధం పొడిగింపు. పశ్చిమగోదావరి జిల్లాలో ఏపీ ఫిషరీస్ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీని ద్వారా రాష్ట్రంలో మత్స్య, ఆక్వా రంగాల్లో సమగ్రాభివృద్ధి సాధించాలన్నదే ప్రభుత్వ ఉద్ధేశ్యం. ఈ యూనివర్సిటీ కోసం రానున్న ఐదేళ్లలో రూ.300 కోట్లు పెట్టుబడి లక్ష్యం. ఆక్వా రంగంలో నిపుణుల కొరత కారణంగా ఏడాదికి సుమారు రూ.2500 కోట్లు నష్టపోతున్నామని అంచనా. ఈ యూనివర్సిటీ ఏర్పాటు ద్వారా ఆక్వా నష్టాన్ని నివారించవచ్చని అంచనా.