ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కొద్దిసేపటి కింద మంత్రి వర్గ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలపై చర్చించి కేబినెట్ ఆమోదించనున్నది. ప్రధానంగా పౌర సరఫరాల కార్పోరేషన్ ద్వారా ఆయిదు వేల కోట్ల రుణ సమీకరణతో పాటు మొత్తం 26 అంశాలపై కేబినెట్ చర్చించనున్నది.
మెడికల్ కళాశాలల నిర్మాణానికి గానూ రాష్ట్ర వైద్య విద్య పరిశోధన కార్పోరేషన్ ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోద ముద్రవేయనున్నది. సర్వే సరిహద్దుల చట్ట సవరణపైనా మంత్రివర్గం చర్చించి తగు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రైతు భరోసా మూడవ విడత ఆర్థిక సహాయం పంపిణీకి గానూ అనుమతి కోరుతూ వచ్చిన ప్రతిపాదనకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నది. కియా కార్ల పరిశ్రమతో పాటు అనుబంధ యూనిట్లనూ ఒకే పరిశ్రమ కింద గుర్తించే అంశంపై కేబినెట్ చర్చించనున్నది. రాష్ట్ర వ్యాప్తంగా 140 పశుసంవర్థక శాఖ డిస్పెన్సరీలు, ల్యాబ్లు ఏర్పాటుకు ఆమోదం తెలుపనున్నది. గన్నవరం విమానాశ్రయం విస్తరణ పనులు, రాష్ట్ర డెయిరీ అభివృద్ధి కార్పోరేషన్ ఉద్యోగులకు పిఆర్సీ, తిరుపతిలో ల్యాండ్ సర్వే అకాడమీ ఏర్పాటుతో పాటు 40 ఏకరాల భూ కేటాయింపు, జనవరి 9న అమ్మఒడి పథకం నిధుల పంపిణీ తదితర అంశాలపై కేబినెట్ చర్చించి ఆమోదం తెలుపనున్నది.