ఏపి కేబినెట్ భేటీ నవంబర్ 4వ తేదీ నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి నిర్ణయించారు. కేబినెట్ సమావేశంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని నేడు సర్క్యులర్ జారీ చేశారు. సచివాలయంలో నవంబర్ 4వ తేదీ ఉదయం 11గంటలకు సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరుగనున్నది. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, ప్రభుత్వ పథకాల అమలు తీరు సహా పలు అంశాలపై చర్చించనున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ప్రతిపక్షాలు అన్నీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ వద్ద ఒకే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దీనిపై ఎలా ముందుకు వెళ్లాలి అనే అంశంపైనా కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. అదే మాదిరిగా రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్న న్యాయపరమైన అంశాలు, రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు విచ్చేస్తున్న పారిశ్రామిక వేత్తలకు అవసరమైన భూముల కేటాయింపు తదితర అంశాలపైనా మంత్రివర్గంలో చర్చించే అవకాశాలు ఉన్నాయి.