(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
ఏపి కేబినెట్ భేటీ రేపు ఉదయం జరుగనున్నది. తొలుత బుధవారం (4వ తేదీ) నిర్వహించాలని తలపెట్టారు. కానీ తరువాత 5వ తేదీ గురువారం ఉదయానికి మార్పు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో గురువారం ఉదయం మంత్రివర్గ సమావేశం జరగనున్నది. ఈ నేపథ్యంలో రాజధాని గ్రామాల్లో నిరసన కార్యక్రమాలపై పోలీసులు ఆంక్షలు విధించారు.
ఒక పక్క అమరావతి రైతులు మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దీక్షలు నిర్వహిస్తుండగా, మరో పక్క మూడు రాజధానులకు అనుకూలంగా దీక్షలు కొనసాగుతున్నాయి. మంత్రివర్గ సమావేశానికి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి, మంత్రుల కాన్వాయ్లు ఈ గ్రామాల మీదుగా సచివాలయానికి వెళ్లనుండటంతో గురువారం దీక్షా శిబిరం నిర్వహించవద్దని అమరావతి రైతులకు పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. అయితే మూడు రాజధానుల శిబిరానికి ఎవరినీ అనుమచించకపోతే తాము శిబిరానికి రామని మందడం రైతులు పోలీసులకు చెప్పారు. మూడు రాజధానులకు అనుకూలంగా దీక్షలు నిర్వహించే వారికి అనుమతి ఇచ్చి తమను రావద్దని ఎలా అంటారని పోలీసులను రైతులు ప్రశ్నించారు.
15 తరువాత అసెంబ్లీ సమావేశాలు?
ఈ మంత్రివర్గ సమావేశంలోనే త్వరలో నిర్వహించాల్సిన అసెంబ్లీ శీతాకాల సమావేశాలు, సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత కరోనా నేపథ్యంలో శీతాకాల అసెంబ్లీ సమావేశాలను కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నాలుగు నుండి ఆరు రోజుల పాటు ఉదయం నుండి మధ్యాహ్నం వరకూ మాత్రమే నిర్వహించే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. తొలుత సెప్టెంబర్ చివరలో అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. అయితే కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. తరువాత అక్టోబర్ రెండవ వారంలో సమావేశాలు నిర్వహించాలనుకున్నారు. కానీ కుదరలేదు. ఈ నేపథ్యంలో ఈ నెల 18 నుండి సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న బిల్లులు తదితర కీలక అంశాలపై కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది.