(ఫైల్ ఫోటో)
అమరావతి: ఎట్టకేలకు ఎన్నికల సంఘం ఆమోదంతో రాష్ట సచివాలయంలో మంత్రివర్గ సమావేశం మంగళవారం మధ్యాహ్నం ఆరంభమయింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ప్రారంభమైన ఈ సమావేశంలో సిఎస్ ఎల్వి సుబ్రమణ్యం, పలు శాఖల మంత్రులు, వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు పాల్గొన్నారు.
కరువు, ఫోని తుఫాను ప్రభావం, తాగునీటి ఎద్దడితో పాటు వాతావరణ పరిస్థితులు, నగేరా పనులకు నిధుల చెల్లింపు తదితర అంశాలపై కీలకంగా చర్చించనున్నారు.
ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ప్రభుత్వం ఏదైనా కొత్త నిర్ణయాలు తీసుకుంటే ఎన్నికల సంఘం అనుమతి తీసుకున్న తరువాతే అమలు చేయాలని ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ధరల సవరింపు, బకాయిల చెల్లింపులపై ఇసి అనుమతి తీసుకున్న తరువాతే అమలు చేయాలనీ, ధరల పెంపునకు సంబంధించి నిర్ణయాలు మీడియాకు వెల్లడించవద్దని ఇసి సూచించింది.
సమావేశంలో మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నిమ్మకాయల చినరాజప్ప, కాల్వ శ్రీనివాసులు, పత్తిపాటి పుల్లారావు, ఎర్రం అచ్చెన్నాయుడు, దేవినేని ఉమమహేశ్వరరావు, అయ్యన్నపాత్రుడు, కెఈ కృష్ణమూర్తి, భూమా అఖిలప్రియ, కొల్లు రవీంద్ర తదితరులు హజరయ్యారు.
విదేశీ పర్యటనల్లో ఉండటం, వివిధ వ్యక్తిగత కారణాల వల్ల మంత్రులు ఆదినారాయణరెడ్డి, అమరనాధ్ రెడ్డి, పితాని సత్యనారాయణలు కేబినెట్ మీటింగ్కు హజరుకాలేదు.