అమరావతి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది సెలవుపై వెళుతున్నారు. ఆయన రేపటి నుండి ఈ నెల 15వరకూ సెలవు తీసుకున్నట్లు సమాచారం. ఈ నెల 16న ఆయన తిరిగి సచివాలయానికి రానున్నారు.
క్యాబినెట్ సమావేశానికి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి రావాల్సి ఉన్న తరుణంలో సిఇఒ సెలవుపై వెళ్లడం చర్చనీయాంశమయ్యింది.
ఈ నెల 14న జరగనున్న క్యాబినెట్ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సిఎస్) ఎల్వి సుబ్రమణ్యం ఆధ్వర్యంలో గురువారం ఎజెండా స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరిగింది.
స్క్రీనింగ్ కమిటీ ఖరారు చేసిన అజెండాను వెంటనే ఎన్నికల సంఘం అనుమతి కోసం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదికి పంపగా ఆయన కేంద్ర ఎన్నికల సంఘానికి (సిఇసి) పంపారు. అయితే సిఇసి నుండి అనుమతి వచ్చేందుకు రెండు రోజులు సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు తెలియజేస్తున్నారు. క్యాబినెట్ సమావేశంపై సోమవారం సాయంత్రానికి సిఇసి నుండి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. క్యాబినెట్ సమావేశం జరగడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని అధికారులు వెల్లడిస్తున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 10వ తేదీన క్యాబినెట్ సమావేశం నిర్వహించాలని నిర్ణయించినా ఎన్నికల సంఘం నుండి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని సిఎస్ ఎల్వి సుబ్రమణ్యం తెలియజేసిన నేపథ్యంలో క్యాబినెట్ సమావేశాన్ని 14వ తేదీకి వాయిదా చేశారు.