AP CID: తెలుగుదేశం పార్టీకి ఏపి సీఐడీ బిగ్ షాక్ ఇచ్చింది. గతంలో ఏపి ఎన్జీవో నేతగా పని చేసి టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్న పరుచూరి అశోక్ బాబును ఏపి సీఐడీ అరెస్టు చేసింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పలువురు టీడీపీ మాజీ మంత్రులు, నేతలు వివిధ కేసుల్లో అరెస్టు అయిన సందర్భాల్లో, ప్రభుత్వ విధానాలపై తీవ్ర స్థాయిలో టీడీపీ వాయస్ వినిపిస్తున్నారు పరుచూరి అశోక్ బాబు. ఇటీవల ఏపి ప్రభుత్వ ఉద్యోగుల ఆందోళన సమయంలోనూ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఈ క్రమంలో అశోక్ బాబు వాణిజ్య పన్నుల శాఖలో పని చేసే సమయంలో బీకాం చదవకుండా చదివినట్లు తప్పుడు సర్టిఫికెట్లు సమర్పించారనీ, రికార్డులు టాంపరింగ్ చేశారన్న ఆరోపణలతో విజయవాడకు చెందిన మెహర్ కుమార్ అనే అతను గతంలో లోకాయుక్తకు పిర్యాదు చేసిన వ్యవహారం బయటకు వచ్చింది. విచారణ జరిపిన లోకాయుక్త వాణిజ్య పన్నుల శాఖ నుండి నివేదిక తెప్పించుకుంది.
AP CID: అశోక్ బాబు అరెస్టు
సమగ్ర దర్యాప్తునకు సీఐడీకి ఫిర్యాదు చేయాలని ఆ శాఖాధికారులను లోకాయుక్త ఆదేశించింది. ఆ మేరకు రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ సంయుక్త కమిషనర్ గీతామాధురి అశోక్ బాబుపై ఇటీవల ఏపి సీఐడీకి ఫిర్యాదు చేయగా ఐపీసీ 477 ఏ, 465, 420 తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా గురువారం అర్ధ రాత్రి ఏపి సీఐడీ అధికారులు అశోక్ బాబును అరెస్టు చేసి తమ కార్యాలయానికి తరలించారు. అశోక్ బాబును అరెస్టు చేయడం పట్ల టీడీపీ ఒక్క సారిగా షాక్ అయ్యింది.
అశోక్ బాబు అరెస్టును ఖండించిన చంద్రబాబు
అశోక్ బాబును అరెస్టు చేయడంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ఉద్యోగుల సమస్యలపై నిలదీస్తున్నందున ప్రభుత్వం ఆయనపై కక్షకట్టిందని చంద్రబాబు ఆరోపించారు. సర్వీస్ మేటర్ లో తప్పుడు కేసులు పెట్టి అశోక్ బాబును అరెస్టు చేశారని చంద్రబాబు మండిపడ్డారు. అర్ధరాత్రి సమయంలో అరెస్టు చేయాల్సిన అవసరం ఏమి వచ్చిందని ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వం చేస్తున్న ప్రతి తప్పునకూ మూల్యం చెల్లించకతప్పదని అన్నారు. అశోక్ బాబును అరెస్టును నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు. అశోక్ బాబు అరెస్టుపై టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ స్పందిస్తూ అశోక్ బాబుపై పెట్టిన కేసు కోర్టులో నిలిచేది కాదనీ, అక్కడే పోరాడి తేల్చుకుంటామని అన్నారు.