(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: రాజధాని అమరావతి ప్రాంతంలో ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలపై ఇద్దరు టిడిపి మాజీ మంత్రులతో పాటు మరో వ్యక్తిపై సిఐడి కేసు నమోదు చేసింది. గుంటూరు జిల్లా మంగళగిరి టౌన్ పోలీస్ స్టేషన్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిఐడి ఎస్పి మేరీ ప్రశాంతి వివరాలు వెల్లడించారు. మాజీ మంత్రులు పత్తిపాటి పుల్లారావు, నారాయణతో పాటు మరో వ్యక్తి బెల్లకొండ నరసింహాపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. తమను మభ్యపెట్టి భూమి కొనుగోలు చేశారని వెంకటాయపాలెంకు చెందిన దళిత మహిళ పోతురాజు బుజ్జి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిపై ఐపిసి 420, 506,120బి, సెక్షన్ 3 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
తమ విచారణలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయని ఎస్పి ప్రశాంతి తెలిపారు. 797 మంది తెల్లరేషన్ కార్డుదారులు భూములు కొనుగోలు చేసినట్లు నిర్ధారణ అయ్యిందనీ, ఎకరం మూడు కోట్ల రూపాయల చొప్పున 220కోట్ల రూపాయలతో భూములు కొనుగోలు చేసినట్లు గుర్తించామనీ చెప్పారు. భూములు కొనుగోలు చేసిన వారి వివరాలను ఆరా తీస్తున్నామన్నారు. ఈ కేసు విచారణకు నాలుగు బృందాలను ఏర్పాటు చేసినట్లు ఎస్పి తెలిపారు.