(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ అదనపు ప్రధాన కార్యదర్శి డాక్టర్ పి వి రమేష్ రాజీనామాను ప్రభుత్వం ఆమోదించింది.రమేష్ రాజీనామాను ఆమోదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రమేష్ విజ్ఞప్తికి అనుగుణంగానే నవంబర్ 1 నుండి రాజీనామా వర్తింపజేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. వాస్తవానికి విధుల నుండి తప్పుకున్నానని ఈ నెల 17వ తేదీనే ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
“35 ఏళ్ల నుండి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర స్థాయిలో ప్రజా సేవ చేస్తున్న క్రమంలో ప్రజలకు మెరుగైన సుపరిపాలన, చిత్తశుద్ధితో, పోటీ తత్వంతో కూడిన సేవలు అందించేందుకు తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు” అంటూ ట్వీట్ చేశారు. సీఎం అదనపు ప్రధాన కార్యదర్శి గా తనకు అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
1985 ఐఏఎస్ బ్యాచ్ కి డాక్టర్ పీవి రమేష్ కి ప్రభుత్వ వర్గాల్లో మంచి పేరు ఉంది. గతంలో కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాల్లో ఆయన కీలక బాధ్యతలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ లో గత ఏడాది జూన్ 8న సీఎం అదనపు కార్యదర్శిగా నియమితులయ్యారు. అయితే ఏమి జరిగిందో తెలియదు కానీ ఈ ఏడాది జూలై నెలలో ఆయన అజమాయిషీలోని శాఖలను తొలగించారు. అప్పటి నుండే ఆయన అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. దేశంలో ఐఏఎస్ అనేది రాజకీయ నేతలు, వ్యాపారులను మెప్పించే కస్టమర్ సర్వీస్ గా మారిపోయిందంటూ పంజాబ్ కు చెందిన ఓ విశ్రాంత ఐఏఎస్ చేసిన ట్వీట్ ను పీవి రమేష్ రీట్వీట్ చేయడం రాష్ట్రంలో తీవ్ర సంచలనం అయ్యింది. ఆ తరువాత కొద్ది రోజులు సైలెంట్ గా ఉన్న రమేష్ రాజీనామా చేశారు.