అమరావతి, ఫిబ్రవరి 16: పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన వీర జవానులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. శనివారం చంద్రబాబు మాట్లాడుతూ ఒకొక్క అమర జవాను కుటుంబానికి ఐదు లక్షల చొప్పున ఆర్థిక సహాయం ఇవ్వనున్నట్లు తెలిపారు.
అమరుల త్యాగాలను జాతి ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని చంద్రబాబు అన్నారు. ఉగ్రవాదాన్ని అణచివేయడంలో కేంద్ర ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయానికైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్దతు తెలియజేస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు. జవానుల కుటుంబాలకు అందరూ అండగా నిలవాలని కోరారు.
భవిష్యత్తులో ఇలాంటివి చోటు చేసుకోకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పక్కా వ్యూహాన్ని అనుసరించాలని చంద్రబాబు సూచించారు. ఉగ్రదాడిలో 40మంది ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమని చంద్రబాబు అన్నారు.