చిత్తూరు, మార్చి 4: తెలుగుదేశం పార్టీ కార్యకర్తల డేటా అప్డేట్ చేస్తుంటే దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం మదనపల్లి సమీపంలో చిప్పిలి వద్ద హంద్రీ-నీవా జలాలకు జల హారతి ఇచ్చే కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు.
అనంతరం జరిగిన బహిరంగ సభలో టిడిపి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు వివరించారు.
ఐటి గ్రిడ్పై కేసుల నమోదుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. డేటా అనేది తెలుగుదేశం పార్టీ వ్యక్తిగత విషయమని చంద్రబాబు అన్నారు. ‘మా దగ్గర 60లక్షల కార్యకర్తల డేటా ఉందన్నారు. హైదరాబాదులో ఉండి మన ప్రభుత్వంపై దాడులు చేస్తున్నారంటూ’ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎపి డేటా దొంగిలిస్తే తెలంగాణ ప్రభుత్వం కాపాడుతుందట, మన అస్తిపై తెలంగాణ ప్రభుత్వం ప్రేమ చూపిస్తోంది అంటూ చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఎపి డేటా ఉందంటున్నారు, ఉంటే మాకు పంపించండి అని చంద్రబాబు అన్నారు.
వైసిపి దొంగలు ఫిర్యాదు చేస్తే కేసులు పెట్టి అరెస్టు చేస్తారా? మీ మూలాలు కూడా కదిలిపోతాయి అంటూ చంద్రబాబు హెచ్చరించారు..
మీ ప్రభుత్వానికి డేటా కూడా లేదు అంటూ చంద్రబాబు తెలంగాణ ప్రభుత్వాన్ని దెప్పిపొడిచారు.
జగన్, కెసిఆర్ కుమ్మక్కై టిడిపిని దెబ్బతీయాలని ఆలోచిస్తున్నారంటూ చంద్రబాబు మండిపడ్డారు. వారికి దమ్ముంటే ముసుగు తొలగించి పోటీకి రావాలని చంద్రబాబు పునరుద్ఘాటించారు.
ఈ సందర్భంగా విజయ పాల డెయిరీ సహకార సంఘం ఆధ్వర్యంలో 24కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన టెట్రా ప్యాక్ యూనిట్కు చంద్రబాబు శంకుస్థాన చేశారు.
రాత్రి తిరుపతిలో రూ.1300కోట్ల రూపాయలతో చేపట్టనున్న స్మార్ట్ సిటీ అభివృద్ధి పనులకు చంద్రబాబు భూమిపూజ, శంకుస్థాపన చేయనున్నారు.