పోలవరం ప్రాజెక్టు సందర్శన పేరుతో చంద్రబాబు ప్రభుత్వం ఎన్ని కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేసిందో బయటపెట్టారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి. పోలవరం ప్రాజెక్టుపై చర్చ సందర్భంలో సీఎం జగన్ మాట్లాడుతూ చంద్రబాబు హయాంలో కేవలం 14శాతం పనులు మాత్రమే జరిగాయన్నారు. 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం అయిన తరువాత 86 శాతం భూసేకరణ చేసి కుడి కాలువ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టారని గుర్తు చేశారు. అసెంబ్లీలో చర్చ జరగకుండా టీడీపీ కావాలని అడ్డుపడుతోందని మండిపడ్డారు. పోలవరం కోసం వైఎస్ అన్ని క్లీయరెన్స్ లు తెచ్చారని గుర్తు చేశారు. తాము అధికారంలోకి రాక ముందు వరకు 29.80 శాతం పోలవరం పనులు పూర్తి అయ్యాయని సీఎం జగన్ చెప్పారు.
కేవలం 14 శాతం పనులు చేసిన చంద్రబాబు తన భజన కోసం ఏకంగా అక్షరాల 83కోట్ల 45లక్షలు పోలవరం సందర్శన పేరుతో ప్రజా ధనం దూబరా చేశారని వివరించారు. ప్రజాధనం ఉపయోగించి చంద్రబాబు ఎలా భజన చేయించుకున్నారో చూడండి అంటూ ఓ వీడియోను సభలో వేసి చూపించారు. అందులో పోలవరం సందర్శనకు వచ్చిన కొంత మంది మహిళా కార్యకర్తలు చంద్రబాబును పొగుడుతూ భజన పాట పాడారు. చంద్రబాబు కృషి వల్లే పోలవరం ప్రాజెక్టు పూర్తి అయ్యిందంటూ భజన చేశారు. ఈ వీడియోను చూసిన సీఎం జగన్, స్పీకర్ తమ్మినేని సీతారాంతో సహా అధికార పక్ష సభ్యులు పగలబడి నవ్వారు. జగన్ నవ్వు ఆపుకోలేక మధ్యలోనే వీడియోను ఆపివేయించారు. చంద్రబాబు ఇలా ప్రజల సొమ్ముతో బస్సులు పెట్టి భజన చేయించుకున్నారని జగన్ విమర్శించారు. అప్పట్లో ఇన్ని నేరాలు, ఘోరాలు జరిగాయన్నమాట అంటూ స్పీకర్ తమ్మినేని సీతారాం చలోక్తి విసిరారు.
9మంది టీడీపీ సభ్యులు సస్పెన్షన్
తొలుత పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతున్న సమయంలో టీడీపీ సభ్యులు ఆయన ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ స్పీకర్ వెల్లోకి దూసుకువెళ్లారు. స్పీకర్ తమ్మినేని సీతారాం పలు మార్లు విజ్ఞప్తి చేసినా నిరసన కొనసాగిస్తుండటంతో 9మంది టీడీపీ సభ్యులను ఒక్క రోజు పాటు సభ నుండి సస్పెండ్ చేశారు. దీంతో వరుసగా శాసనసభ శీతాకాల సమావేశాలలో వరుసగా మూడవ రోజు సభ్యులు సస్పెన్షన్ వేటుకు గురి అయ్యారు. అయితే సస్పెండ్ అయిన సభ్యులతో పాటు చంద్రబాబుతో సహా మిగిలిన సభ్యులు కూడా వాకౌట్ చేసి బయటకు వెళ్లిపోయారు.