అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై కీలక వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తామని అన్నారు. హోదా వస్తే ప్రోత్సాహకాలు మెండుగా ఉండేవని, ఇవాళ కాకపోతే రేపు అయినా ప్రత్యేక హోదా వస్తుందని ఆయన పేర్కొన్నారు. మౌలిక సదుపాయాల్లో రాష్ట్రం మెరుగ్గా ఉందనీ, రాష్ట్రంపై కేంద్రం ఆధారపడే రోజులు వస్తాయనీ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది నిండిన నేపథ్యంలో నాలుగవ రోజు వైసీపీ మేధోమథనం సదస్సులో ‘మన పాలన-మీ సూచన’ అంశంపై ప్రసంగంలో జగన్ ఇలా అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా వస్తే ఎన్నో కంపెనీలు వచ్చేవని అన్నారు. రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం అధికారంలో ఉందనీ, 22 మంది ఎంపీలతో దేశంలోనే నాలుగో స్థానంలో ఉన్నామనీ పేర్కొన్నారు. గత టీడీపీ ప్రభుత్వం హోదాను తీసుకురాలేకపోయిందని జగన్ విమర్శించారు. గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీ పూర్తి మెజార్టీతో కేంద్రంలో అధికారంలోకి వచ్చిందనీ, లేదంటే ఆ పార్టీకి మద్దతిచ్చే క్రమంలో ప్రత్యేక హోదా డిమాండ్ చేసేవాళ్లమని అన్నారు. భవిష్యత్లో మాత్రం మన అవసరం కేంద్రానికి ఏర్పడుతుందని అప్పుడు హోదా డిమాండ్ చేసి సాధిస్తామని చెప్పుకొచ్చారు.
గత టీడీపీ ప్రభుత్వం గ్రాఫిక్స్ చూపించి ప్రజలను మోసం చేసిందనీ, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో తొలి ర్యాంక్ అంటూ గొప్పగా చెప్పుకుందని జగన్ విమర్శించారు. పారిశ్రామిక రంగానికి భూములు ఇచ్చేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. రాష్ట్రంలో ప్రాథమిక స్థాయి నుంచి ఆంగ్ల మాధ్యమ విద్య కోసం ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడా విద్యుత్ కొరతలేదని పేర్కొన్నారు. అవినీతి రహిత పాలనకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని అన్నారు. రివర్స్ టెండరింగ్తో ఇప్పటికే ప్రజాధనం చాలా వరకు ఆదా చేశామని సీఎం వివరించారు.
‘ఆంధ్రప్రదేశ్లో 972 కి.మీ సముద్ర తీర ప్రాంతం, నాలుగు పోర్టులు, ఆరు ఎయిర్ పోర్టులు ఉన్నాయి. 1400 కంపెనీలు రాష్ట్రంలో 11,549 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయి. మరో 20 ప్రముఖ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. కొవిడ్ సమయంలో చిన్న తరహా పరిశ్రమలను ఆదుకునేందుకు అన్ని చర్యలు చేపట్టాం. ఎంఎస్ఎంఈలను ఆదుకునేందుకు ‘వైఎస్ఆర్ నవోదయం’ పథకం ద్వారా ఆర్థిక సహకారం అందిస్తున్నాం. పెండింగ్లో ఉన్న రాయితీలు విడుదల చేస్తున్నాం. రాష్ట్రంలో విద్యుత్ కొరత లేదు. తాగు, సాగు, పారిశ్రామిక అవసరాల కోసం వాటర్ గ్రిడ్ అభివృద్ధి చేస్తున్నాం. దేశంలోనే అత్యుత్తమ పోలీసు వ్యవస్థ ఏపీలో ఉంది’ అని జగన్ వివరించారు.