సంసద్ రత్న అవార్డు-2020 కి ఎంపికైన శ్రీకాకుళం ఎం పీ టీడీపీ యువనేత కింజరాపు రామ్మోహన నాయుడుకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశంసలు అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అవార్డుకు ఎంపిక అయిన అతి పిన్న వయసు ఎంపీగా రామ్మోహననాయుడు రికార్డు సృష్టించారు. పార్లమెంట్ సభ్యులు కనపరిచిన అత్యుత్తమ పనితీరు, ప్రజా సమస్యల పరిష్కారంలో వారు చూపిన చొరవని గుర్తించి జ్యూరీ కమిటీ.. అవార్డ్స్ ఇస్తూ ఉంటుంది. దేశ వ్యాప్తంగా ఎనిమిది మంది ఎంపీలతో పాటుగా ఇద్దరు రాజ్యసభ సభ్యులను 2019-20 సంవత్సరం సంసద్ రత్న అవార్డులకు ఎంపిక చేశారు.
పార్లమెంటరీ వ్యవహారాల శాఖా మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ అధ్యక్షతన ముగ్గురు సభ్యుల జ్యూరీ కమిటీ ఆధ్వర్యంలో వీరిని ఎంపిక చేశారు.
దీనిపై రామ్మోహన్ నాయుడు స్పందిస్తూ ఈ అవార్డు తన నియోజకవర్గ ప్రజలు, టీడీపీ, కింజరాపు కుటుంబ వారసునిగా ప్రజాసేవలో వున్న తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. ప్రముఖ రాజకీయ నేతలు శశి థరూర్, సుప్రియ సులే వంటి సీనియర్ నాయకులతో కలిసి ఈ అవార్డును అందుకోవడం తనకు చాలా ఆనందంగా వుందని అన్నారు.
కాగా పార్టీ వేరైనప్పటికీ తెలుగు రాష్ట్రానికి చెందిన రామ్మోహన్ నాయుడు సంసద్ రత్న అవార్డులకు ఎంపిక కావడం పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రభుత్వం తరపున ఒక లెటర్ రాసే ఆలోచనలో ఉన్నారట.
ప్రత్యేక హోదా అంశంపై పార్లమెంట్ లో రామ్మోహన్ నాయుడు హిందీ భాషలో చేసిన ప్రసంగం ప్రధాన మంత్రి మోడీతో సహా సభికులందరిని ఆకట్టుకున్న విషయం తెలిసిందే.
కాగా 2010 సంవత్సరంలో మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం స్ఫూర్తితో సంసద్ రత్న అవార్డులు ప్రారంభమయ్యాయి.