అమరావతి: రాష్ట్రంలోని 49 లక్షల మంది రైతులకు వైఎస్ఆర్ రైతు భరోసా – పిఎం కిసాన్ పధకం ద్వారా లబ్ధి చేకూరుతోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మంగా ప్రవేశపెట్టిన “వైఎస్సార్ రైతు భరోసా– పీఎం కిసాన్” పథకాన్ని శుక్రవారం సిఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ప్రతి రైతు కుటుంబానికి తొలి విడతగా రూ.7,500 ఖాతాలో జమ కానున్నాయి. ఈ సందర్బంగా సీఎం మాట్లాడుతూ.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పథకానికి శ్రీకారం చుట్టడం బాధగా ఉందనీ, కరోనా పరిస్థితుల కారణంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతు భరోసాను ప్రారంభిస్తున్నామని చెప్పారు. సాధారణ పరిస్థితులు ఉంటే రైతులతో కలిసి భారీ సభ ద్వారా ఈ కార్యక్రమం నిర్వహించే వాళ్లమని అన్నారు. రైతులు, రైతు కూలీలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందనీ, దేశానికి అన్నం పెట్టే అన్నదాత రైతన్నలకు ఎంత చేసినా తక్కువే అని పేర్కొన్నారు. వ్యవసాయ పెట్టుబడులకు రైతులు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో పెట్టుబడి సాయం అందించేందుకే రైతు భరోసా కింద ఏటా రూ.13,500 అందిస్తున్నామని చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోలో రూ. 12,500 చొప్పున నాలుగేళ్లు ఇస్తామని చెప్పినా..13,500 రూపాయల చొప్పున ఐదేళ్ల పాటు ఇవ్వనున్నట్లు తెలిపారు.
పార్టీలకు అతీతంగా రైతులందరికీ పెట్టుబడి సాయం
గత ఏడాది రూ.6350 కోట్లు రైతు భరోసా కింద చెల్లించామన్నారు. రైతు భరోసా కింద రూ.5500 నగదు రైతుల బ్యాంకు ఖాతాలో జమ అవుతాయన్నారు. ఏప్రిల్లో రెండు వేలు ఇవ్వగా మిగిలిన 5500 రూపాయలు ఇప్పుడు ఇస్తున్నామని వెల్లడించారు. కౌలు రైతులు, అటవీ భూములు, అసైన్డ్ భూములు సాగు చేస్తున్న వారికి రూ.7500 అందజేస్తామని, అక్టోబర్లో 4 వేలు, వచ్చే సంక్రాంతికి మరో 2 వేలు అందజేస్తామని తెలిపారు. పార్టీలకు అతీతంగా రైతులందరికీ పెట్టుబడి సాయం అందిస్తున్నామని, గ్రామ సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితా ఉంచుతున్నామని చెప్పారు. ఎవరైనా పేరు లేకపోతే నమోదు చేయించుకునే అవకాశం కల్పించామని, రైతులకు మేలు చేయాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. రైతు భరోసా నగదు బ్యాంకు ఖాతాలో జమ కాకుంటే రైతులు నేరుగా 1902 కాల్ సెంటర్కు ఫోన్ చేసి పిర్యాదు తెలపాలన్నారు.
ఈ నెల 30న రైతు భరోసా కేంద్రాలు ప్రారంభం..
ఈ నెల 30వ తేదీన రాష్ట్రంలో 10,641 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని జగన్ చెప్పారు. ఈ కేంద్రాల్లో రైతుల కోసం నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంటాయన్నారు. రైతు భరోసా కేంద్రాల్లో వ్యవసాయ శాఖ సిబ్బంది అందుబాటులో ఉండి రైతులకు వ్యవసాయానికి సంబంధించిన సలహాలను ఆర్బీకే ద్వారా అందిస్తారని, భూసార పరీక్షలు కూడా రైతు భరోసా కేంద్రాల నుంచే చేస్తారని చెప్పారు. రైతు భరోసా కేంద్రంలో మూడు రకాల ల్యాబ్లను అందుబాటు లోకి తెస్తామని. జిల్లా, నియోజకవర్గ, రైతు భరోసా కేంద్రాల్లో ల్యాబ్లు ఉంటాయి. ఈ-క్రాపింగ్ ద్వారా పంట రుణాలను ఇప్పించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గిట్టుబాటు ధర కల్పించడంలో కూడా ఆర్బీకేలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు.
కాగా వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న పలువురు రైతులు ‘రైతు భరోసా’ పధకంపై సంతృప్తి వ్యక్తం చేశారు.