అమరావతి : ఎన్నికల మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్గా భావిస్తున్నానని తొలి నుండి చెబుతున్న వైసీపీ అధినేత, ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్ది..ఇప్పటికే మేనిఫెస్టోలోని 90 శాతం హామీలను నెరవేర్చినట్లు స్పష్టం చేశారు. ముఖ్య మంత్రిగా బాధ్యతలు చేపట్టి ఏడాది కాలం పూర్తయిన సందర్బంగా శనివారం రాష్ట్రంలో వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం జగన్ మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు అయ్యాయనీ, రైతుభరోసా కేంద్రాలతో గ్రామాల్లో విప్లవాత్మక మార్పులు రానున్నాయనీ పేర్కొన్నారు. మనది రైతు పక్షపాత ప్రభుత్వమని చెప్పామనీ, అదే మాదిరిగా చేసి చుపిస్తున్నామని అన్నారు. రైతు బాగుంటేనే రాష్ట్రం, దేశం బాగుంటుందని నమ్మిన ప్రభుత్వం తమదని జగన్ అన్నారు.
129 హామీల్లో 77 అమలు చేశాం
ఎన్నికల సమయంలో ఇచ్చిన 129 హామీల్లో.. ఇప్పటికే 77 అమలు చేశామని జగన్ చెప్పారు. మరో 36 హామీలు సిద్ధంగా ఉన్నాయని, మిగిలిన 16 హామీలను కూడా త్వరలో నెరవేరుస్తామనీ అన్నారు. మేనిఫెస్టోలో లేని మరో 40 హామీలను కూడా అమలు చేశామని జగన్ వివరించారు. గత ప్రభుత్వ హయాంలో మేనిఫెస్టో పేరుతో బుక్లు రిలీజ్ చేసేవారనీ, 600 లకుపైగా హామీలిచ్చి..10 శాతం కూడా నెరవేర్చలేదని గత టీడీపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. జన్మభూమి కమిటీల నుంచి రాజధాని భూముల వరకు..అన్నీ తమ కనుసన్నల్లోనే ఉండాలని గత ప్రభుత్వం కోరుకునేదన్నారు. ప్రభుత్వ భూమిని పేదలకు ఇస్తుంటే.. కోర్టుకెళ్లి అడ్డుకునే ప్రతిపక్షాన్ని ఇప్పుడే చూస్తున్నామనీ అన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ ఆసుపత్రులు.. చివరకు ప్రభుత్వ డెయిరీలను మూసివేసేందుకు గత ప్రభుత్వం కుట్రలు చేసిందనీ ఆరోపించారు. గత ప్రభుత్వంలో పేదలకు పథకాలు దక్కాలంటే జన్మభూమి మాఫియాకు లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉండేదని విమర్శించారు. ఇప్పుడు అర్హత ఉన్న ప్రతి ఒక్కరి ఇంటికే వెళ్లి పథకాలు అందిస్తున్నామని జగన్ అన్నారు.
ఆరోగ్యశ్రీకి పూర్వ వైభవం
ఆరోగ్యశ్రీని మరింత మెరుగు పర్చామని చెప్పారు. ఆరోగ్య ఆసరా ద్వారా డబ్బులు ఇస్తున్నామని తెలిపారు. కంటి వెలుగు ద్వారా అవ్వా, తాతాలకు, విద్యార్థులకు పరీక్షలు చేయిస్తున్నామనీ వివరించారు. మరో వైపు వాహన మిత్ర, లా నేస్తం, నేతన్న నేస్తం వంటి పథకాలను ప్రారంభించామనీ తెలిపారు. వివిధ పధకాల ద్వారా ప్రజలకు అందుతున్న సేవల గురించి సీఎం జగన్ గణాంకాలతో సహా వివరించారు.