AP CM Jagan – Megastar Chiru: కరోనా వేవ్ తగ్గుముఖం పట్టడంతో ధియేటర్లు తెరిచేందుకు ఎగ్జిబిటర్లు సిద్ధమయ్యారు. అయితే ఏపిలో టిక్కెట్ల ధరల సవరణలతో పంపిణీ రంగం చిక్కుల్లో పడింది. దీంతో చాలా కాలంగా ధియేటర్ల సమస్య కొలిక్కి రాలేదు. ఈ నేపథ్యంలో సమస్య పరిష్కారంకై సినీ పెద్దలు ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డితో బేటీ కావాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి నుండి చిరంజీవికి పిలుపు వెళ్లింది. సీఎం తరపున సమాచార శాఖ మంత్రి పేర్ని నాని నేరుగా చిరంజీవికి ఫోన్ చేశారు. సినీ పెద్దలతో కలిసి వచ్చి ప్రస్తుత ఇండస్ట్రీ సమస్యలను వివరించాలని పేర్ని చిరును ఆహ్వానించారు. గతంలోనూ ఇండస్ట్రీ సమస్యలను పరిష్కరించేందుకు మంత్రి పేర్ని నాని చొరవ తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వ ఆహ్వానం మేరకు ఈ నెల చివరి వారంలో ఏపి సీఎం జగన్ తో చిరు నేతృత్వంలో ఇండస్ట్రీ పెద్దలు భేటీ కానున్నారు.
గతంలో సీఎంతో చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, సురేష్ బాబు బృందం సీఎంతో సమావేశమై సమస్యలను విన్నవించగా సీఎం జగన్ సానుకూలంగా స్పందించిన విషయం తెలిసిందే. సీఎం జగన్ తో చిరుకు వ్యక్తిగతంగా సత్సంబంధాలు ఉన్నాయి. గతంలో చిరు సతీసమేతంగా జగన్ నివాసానికి వెళ్లి సత్కరించారు. చిరు సోదరుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ జగన్ ప్రభుత్వ నిర్ణయాలను విమర్శిస్తుండగా మరో పక్క చిరంజీవి మాత్రం ట్విట్టర్ వేదికగా పలు సందర్భాల్లో ప్రశంసల జల్లు కురిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కారణంగా చిరు నేతృత్వంలో జగన్మోహనరెడ్డితో జరిగే సినీ పెద్దల సమావేశంలో ఇండస్ట్రీ సమస్యలకు సానుకూల పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నారు.