(న్యూఢిల్లీ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నేడు మరో మార భేటీ అయ్యారు. నిన్న సాయంత్రం దాదాపు 40 నిమిషాల పాటు అమిత్ షాతో సమావేశమై పలు విషయాలు చర్చించిన సీఎం వైఎస్ జగన్ను మరో మారు కలవాలని అమిత్ షా సూచించడంతో నేడు కూడా కలిసి రాష్ట్ర అభివృద్ధి అంశాలతో పాటు రాష్ట్రంలో తాజాగా నెలకొన్న పరిస్థితులపై చర్చించినట్లు తెలుస్తోంది.
నేడు అమిత్ షాతో భేటీ కాకముందు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్తో సీఎం జగన్ సమావేశం అయ్యారు. పోలవరం ప్రాజెక్టుకు ఖర్చు చేసిన రూ.4వేల కోట్ల మేర నిధులు రీయింబర్స్ చేయాలనీ, పునరావాస సాయం త్వరితగతిన అందించాలని జగన్ ఆయనను కోరారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు నిధులు అందించాలని జగన్ కోరారు. అదే విధంగా పోలవరం ప్రాజెక్టు పర్యటనకు రావాలని గజేంద్ర సింగ్ షెకావత్ను సీఎం జగన్ కోరగా త్వరలోనే పోలవరం పర్యటనకు వస్తానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
అనంతరం వైసీపీ ఎంపిలతోనూ సీఎం జగన్ సమావేశం అయ్యారు. ఈ కార్యక్రమాల్లో వైసీపి ఎంపిలు విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గతంలో సీఎం జగన్ ఒక పర్యాయం ఢిల్లీకి వెళ్లిన సందర్భంలో అమిత్ షా అపాయిట్మెంట్ లభించకపోవడంతో ఆయనతో భేటీ కాకుండానే వెనుతిరిగి వచ్చారు. అయితే ఈ సారి పర్యటనలో రెండు పర్యాయాలు అపాయిట్మెంట్ ఇవ్వడం, వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించడం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది.