అమరావతి : వైఎస్ జగన్మోహన్ రెడ్ది గడచిన ఎన్నికల్లో 151 సీట్లతో అఖండ విజయం సాధించి ముఖ్య మంత్రి పీఠం అధిష్టించిన విషయం తెలిసిందే. ఇంత భారీ స్థాయి సీట్లు సాధించిన వైసీపీ ప్రభుత్వం ఎవరి సహకారం లేక పోయినా పరిపాలన ఏకచక్రాధిపత్యంగా చేసే పరిస్థితి ఉంది. తన తండ్రి దివంగత ముఖ్య మంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మాదిరిగా ప్రజల్లో చెరగని ముద్ర వేసుకోవాలన్న సంకల్పంతో ప్రజలకు నవరత్న పథకాలు అందిస్తున్నారు. మరో పక్క రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలన్న సంకల్పంతో అభివృద్ధి వికేంద్రీకరణకు మూడు రాజధానుల ప్రకటన చేశారు. అయితే మూడు రాజధానుల ప్రకటనను రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షం టీడీపీతో సహా ఇతర పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి.
విశాఖకు పరిపాలనా రాజధాని తరలింపునకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా వ్యతిరేకిస్తున్న తరుణంలో మొట్టమొదటిగా సినీ రంగం నుండి అయన సోదరుడైన మెగాస్టార్ చిరంజీవి..సీఎం జగన్ నిర్ణయాన్ని స్వాగతించడం జగన్ కు మంచి బూస్ట్ ఇచ్చినట్లు అయింది. దీనితో చిరును వారధిగా చేసుకుని టాలీవుడ్ మద్దతు కోసం సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారనేది టాక్. విశాఖ పరిపాలన రాజధానితో పాటుగా సినీ రాజధానిగా చేయాలన్నది జగన్ ఆలోచనట. అందు కోసం విశాఖలో టాలీవుడ్ ఇండస్ట్రీ అభివృద్ధికి సంపూర్ణ సహకారం ప్రభుత్వం నుండి అందిస్తామని టాలీవుడ్ పెద్దలకు జగన్ భరోసా ఇచ్చినట్లు కూడా వార్తలు వస్తున్నాయి.
కరోనా లాక్ డౌన్ సడలింపుల నేపథ్యంలో సినీ పరిశ్రమ షూటింగ్ ల పునరుద్దరణ, ఇతర సమస్యల పరిస్కారం కొరకు టాలీవుడ్ ప్రముఖులు చిరు నేతృత్వంలో ఇటీవల అటు తెలంగాణ ముఖ్య మంత్రి కెసిఆర్, ఇటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఒక విధంగా చెప్పాలంటే సినీ రంగ ప్రముఖులకు జగన్ ప్రభుత్వం రెడ్ కార్పెట్ పరిచింది.
విశాఖకు చిత్ర పరిశ్రమ వచ్చేందుకు అంగీకరిస్తే వారి స్టూడియోలకు తక్కువ ధరకే భూముల కేటాయింపునకు, అలాగే కళాకారులకు కారు చౌకగా నివేశన స్థలాలు ఇచ్చేందుకు జగన్ సర్కార్ సుముఖత వ్యక్తం చేసిందట. ఇప్పటికే జగన్ ప్రభుత్వం ఎపి లో షూటింగ్స్ లు ఉచితంగా జరుపుకునేందుకు అనుమతులు ఇచ్చింది. తెలుగు చిత్ర సీమకు అనేక ప్రోత్సహకాలు కూడా ప్రకటిస్తూ జీవో జారీ చేసింది జగన్ సర్కార్. ఈ తరుణంలోనే వారికి మరిన్ని హామీలు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ మద్దతు జగన్ కు ఉంటుందంటారా? తెలుగు చిత్ర పరిశ్రమ విశాఖ వస్తుందంటారా? మీరూ గెస్ చేయండి.