అమరావతి : వ్యవస్థలో మార్పు తీసుకువచ్చి, ప్రజలకు సుపరిపాలన అందించాలన్న లక్ష్యంతో గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. నేడు గ్రామ సచివాలయ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తోందని సీఎం ప్రశంసించారు.
సోమవారం వైసీపీ ప్రభుత్వ ఏడాది పాలనపై ‘మన పాలన-మీ సూచన’ పేరుతో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మొదటి ఏడాదిలో జరిగిన సంక్షేమం.. సంస్కరణలపై జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి సమీక్ష నిర్వహించారు. అన్ని జిల్లా కేంద్రాల నుంచి లబ్దిదారులు, నిపుణులు, ప్రముఖులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఆరు రోజుల పాటు ఈ మేధోమథన సదస్సులు జరగనున్నాయి.
మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి మాటను నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నామనీ, మొదటి సంవత్సరంలోనే 90శాతం మేనిఫెస్టో హామీలను అమలు చేశామనీ జగన్ చెప్పారు. ‘ఎన్నికల ముందు 14 నెలల పాటు పాదయాత్ర చేశాను. పాదయాత్రలో ఉదయం నుంచి రాత్రి వరకు ప్రజలతో మమేకమయ్యాను. వివక్షలేని పాలన అందించాలని గట్టిగా నమ్మాను. మనసా, వాచా, కర్మణా నీతివంతంగా పాలన అందించడమే నా థ్యేయం. ఏ లబ్ధిదారుడికి అన్యాయం జరగకుండా గ్రామ సచివాలయ వ్యవస్థను రూపొందించాం. చివరి లబ్దిదారుడి వరకు అందరికీ న్యాయం చేసేందుకు విప్లవాత్మక మార్పులు తెచ్చాం.
ప్రజల ఇంటి ముందుకే సంక్షేమ ఫలాలు అందిస్తున్నాం. గ్రామ సచివాలయాల ద్వారా లక్షా 35 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. ప్రతి 50 ఇళ్లకు ఒక గ్రామ వాలంటీర్ను నియమించాం. ప్రజలందరూ సంతృప్తి చెందే స్థాయిలో గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశాం. గతంలో లంచమిస్తే తప్ప పెన్షన్ రాని పరిస్థితి ఉండేది. ప్రతినెలా ఒకటో తారీఖు ఉదయాన్నే చిరునవ్వుతో పెన్షన్ అందిస్తున్నాం. గ్రామ వాలంటీర్లు, ఆశా వర్కర్ల కృషి వల్లే సమర్థంగా కోవిడ్ను ఎదుర్కోగలిగాం’ అని సీఎం జగన్ వివరించారు.
మద్యం నియంత్రణ చర్యల్లో భాగంగా ధరలను పెంచడం వల్ల గతంలో వారానికి అయిదు సార్లు తాగేవాళ్లు ఇప్పుడు రెండు సార్లే తాగుతున్నారని, దీనితో రాష్ట్రంలో మద్యం అమ్మకాలు 24 శాతం తగ్గాయని చెప్పారు. ప్రతి గ్రామంలో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ తెచ్చే ప్రయత్నం చేస్తున్నామని, 54 రకాల మందులు గ్రామస్థాయిలో అందుబాటులో ఉంచుతున్నామని, వైఎస్సార్ విలేజ్ క్లినిక్ ద్వారా ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని అన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తూ జనతా బజార్లు ఏర్పాటు చేస్తున్నామనీ జగన్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.