అమరావతి: ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్మోహనరెడ్డి గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న పలు నిర్ణయాలపై సమీక్షలు చేస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నారు. అదే క్రమంలో రాష్ట్రంలో సిబిఐ దర్యాప్తునకు ఉన్న అడ్డంకిని తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్రంలో సిబిఐ దర్యాప్తు జరపాలంటే రాష్ట్రప్రభుత్వం ముందస్తు అనుమతిని తప్పనిసరి చేస్తూ కొద్దికాలం క్రితం చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో పని చేసే సిబిఐ ఢిల్లీ పోలీసు చట్టం కింద ఏర్పాటయింది. ఆ కారణంగా దేశంలోని ఏ రాష్ట్రంలో అయినా కేసులు దర్యాప్తు చేయాలంటే ఆ రాష్ట్రప్రభుత్వం అనుమతి తప్పనిసరి. సాధారణంగా రాష్ట్రప్రభుత్వాలు కేసు కేసుకూ అనుమతి అవసరం లేకుండా గంపగుత్త అనుమతి ఉత్తర్వులు ఇస్తాయి. ఆంధ్రప్రదేశస్లో కూడా ఆలాంటి అనుమతే ఉండేది. అయితే కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐని కేంద్ర ప్రభుత్వం రాజకీయ వేధింపులకు ఒక ఆయుధంగా వాడుకుంటోందన్న ఆరోపణల నేపథ్యంలో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం గతంలో ఉన్న సిబిఐ సమ్మతి ఉత్తర్వులను రద్దు చేసింది. మోదీ ప్రభుత్వం నుంచి టిడిపి బయటకు వచ్చిన తర్వాత సంభవించిన పరిణామం ఇది. రెండవసారి ప్రదానిగా ఎన్నికయిన మోదీతో సత్సంబంధాలు నెలకొల్పుకుంటున్న జగన్ ఈ నిర్ణయాన్ని తిరగదోడి తాజా ఉత్తర్వులు ఇచ్చారు..