అమరావతి: ఏపి కేబినెట్ భేటీ ప్రారంభమైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన మంత్రులు సమావేశం అయ్యారు. నవంబర్ ఒకటవ తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవం ఏర్పాటుపై కేబినెట్లో చర్చించనున్నారు. అలాగే నవంబర్లో ప్రారంభించే సంక్షేమ పథకాలపై కూడా సమీక్షించనున్నారు. జనవరి 26వ తేదీ నుండి అమల్లోకి తీసుకురానున్న జగనన్న అమ్మ ఒడి పథకం మార్గదర్శకాలను ఈ సమావేశంలో మంత్రివర్గం ఖరారు చేయనుంది. అలాగే మహిళలు, పిల్లలు తీవ్ర రక్తహీనత, పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న 77 గిరిజన మండలాల్లోని 1,642 గ్రామ పంచాయతీల్లో అదనపు పౌష్టికాహారం అందించేందుకు చేపట్టనున్న పైలెట్ ప్రాజెక్టుకు కూడా కేబినెట్ ఆమోదం తెలుపనుంది.
ఈ పైలెట్ ప్రాజెక్టు ద్వారా 66 వేల మంది గర్భవతులు, బాలింతలకు, 3.18 లక్షల మంది పిల్లలకు అదనపు పౌష్టికాహారం అందిస్తారు. అలాగే హజ్ యాత్రికులకు, జెరూ సలేం యాత్రికులకు అందజేసే ఆర్థిక సాయాన్ని మూడు లక్షల రూపాయల లోపు వార్షిక ఆదయం ఉన్న వారికి 40 వేల రూపాయల నుండి 60 వేల రూపాయలకు, మూడు లక్షల రూపాయలకుపైగా వార్షికాదాయం ఉన్న వారికి 20వేల రూపాయల నుండి 30 వేల రూపాయలకు పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
రాష్ట్రంలో రోబో ఇసుకను ప్రోత్సహించేందుకు ప్రస్తుతం ఉన్న క్రషర్స్కు పావలా వడ్డీకే రుణాలను ఏపిఎస్ఎఫ్సీ ద్వారా అందించేందుకు మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఏపి అడ్వొకేట్ సంక్షేమ నిధి చట్టంలో సవరణలు, అలాగే దేవాదాయ చట్టంలో సవరణలకు సంబంధించి ముసాయిదా బిల్లులను కేబినెట్లో ఆమోదం తెలిపే అవకాశం ఉంది.