విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో 56 బీసీ ఉప కులాల కార్పోరేషన్ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం బీసి సంక్రాంతి పేరుతో పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి బీసీల అభ్యున్నతికి వైసీపీ ప్రభుత్వం చేస్తున్న చేసిన కృషిని వివరించడంతో పాటు అమరావతి ఉద్యమంలో చంద్రబాబు పాత్రపైనా విమర్శలు గుప్పించారు. ఒక దిగిపోయిన పాలకుడు, చెడిపోయిన బుర్రతో.. సొంత లాభం కోసం ఇన్ సైడర్ ట్రేడింగ్ చేశారని జగన్ ఆరోపించారు. రైతుల దగ్గర తక్కువ ధరకు చంద్రబాబు బినామీలతో భూములు కొనుగోలు చేసి అక్కడే రాజధాని పెట్టాలని ముందే నిర్ణయించారని అన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్న సంకల్పంతో మూడు రాజధానులను తీసుకువస్తే బీనామీలతో కొన్న భూముల ధరలు ఎక్కడ పడిపోతాయన్న భయంతో ఉద్యమం చేస్తున్నారని జగన్ విమర్శించారు.
ఇదే వేదికపై 18 నెలల క్రితం తాను సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన విషయాన్ని గుర్తు చేసిన జగన్ వెనుకబడిన వర్గాలకు ఈ స్థాయిలో పదవులు కల్పించడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి అని అన్నారు. నామినేటెడ్ పదవుల్లోనూ సగ భాగం మహిళలకు ఇవ్వడం కూడా దేశంలో ఎక్కడా లేదని అన్నారు. బీసీలు అంటే వెనుకబడిన వర్గాలు కాదనీ మన సంస్కృతికి వెన్నెముక కులాలని జగన్ అభివర్ణించారు. తన కేబినెట్లోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు 60శాతం పదవులు ఇచ్చామన్నారు. అసెంబ్లీ స్పీకర్ కూడా బీసీ సామాజిక వర్గానికే చెందిన వారేనని గుర్తు చేస్తూ నలుగురు రాజ్యసభ సభ్యుల్లో ఇద్దరు బీసీలకు అవకాశం కల్పించామని వైఎస్ జగన్ చెప్పారు. పదవులు పొందిన నాయకులు వారి సామాజిక వర్గాల్లో అర్హులందరికీ సంక్షేమ పథకాలు సక్రమంగా అందేలా బాధ్యత తీసుకోవాలని సూచించారు. గత ప్రభుత్వ హయాంలో కార్పోరేషన్లను నిర్వీర్యం అయ్యాయని విమర్శించారు. ప్రస్తుతం కార్పోరేషన్లలో సమూల మార్పులు తీసుకురావాలని రాజకీయాలకు తావు లేకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ నెల 25న రాష్ట్రంలో ఇళ్ల పట్టాల పంపిణీ పెద్ద ఎత్తున జరుగుతోందని పేర్కొన్నారు. నియోజకవర్గాల్లో 15 రోజుల పాటు ఎమ్మెల్యేలు ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తారని చెప్పారు. కోర్టు అనుమతి రాగానే లబ్దిదారుల పేరుతో రిజిస్ట్రేషన్ లు చేయడం జరుగుతుందని జగన్ అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, కార్పోరేషన్ చైర్మన్ లు, పెద్ద సంఖ్యలో వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?