దీపావళి పండుగను పురస్కరించుకుని ప్రజా ప్రతినిధులు, నేతలు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ట్విట్టర్ వేదికగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి
“దీపావళి అంటే దీపాల వరస…దుష్ట రాక్షస శిక్షణ చేసే దైవ శక్తి, దుర్మార్గం మీద ఉగ్రతాండవం చేసే స్త్రీ శక్తి, మోగించిన విజయ దుందుభికి ప్రతీక.. మనం నేడు వెలిగించే… ఆ దీపాల వరస! చీకట్లను చీల్చే వెలుగుల పండగ సందర్భంగా ..రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు!” అంటూ సీఎం జగన్మోహనరెడ్డి ట్వీట్ చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు
“లోగిళ్ళలో వెలుగులు నింపి ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని ఇంట్లోకి ఆహ్వానించే దీపావళి పండుగ శుభవేళ… ఆ లక్ష్మీదేవి మీ ఇంటిల్లిపాదినీ సకల శుభాలతో అనుగ్రహించాలని కోరుకుంటూ… ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు!” అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.
పవన్ కళ్యాణ్, జనసేన అధినేత
“యజ్ఞయాగాదులు మొదలు శుభకార్యం దీపారాధనతోనే ఆరంభమవుతాయి. దీపానికి అంతటి ప్రాముఖ్యతను ఇస్తాం. తమసోమా జ్యోతిర్గమమయ అంటూ అజ్ఞానం నుండి సుజ్ఞానం వైపు అడుగులు వేసేలా చేసేదే దీపం. భారతీయ సంస్కృతిలో భాగమైన ఈ దీపం..దీపావళిగా ఆనంద వినోదాలతో పాటు భక్తి పారవశ్యంతో ఓలలాడించడానికి మన ముందుకు వస్తున్న శుభతరుణంలో తెలుగు వారందరికీ దీపావళి శుభాకాంక్షలు” అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఇదే సందర్భంలో పలు జాగ్రతలను తెలియజేశారు పవన్ కళ్యాణ్. దీపావళి అనంతరం ఎందరో గాయాల బారినపడటం, ముఖ్యంగా కనులకు గాయాలు అవ్వడం చూస్తున్నామనీ, వింటున్నామనీ, అటువంటి ప్రమాదాల నివారణకు జాగ్రత్తగా ఉండాలని సూచించారు పవన్ కళ్యాణ్. పర్యావరణానికి హాని చేయని బాణాసంచా సామాగ్రినే వాడాలని తెలిపారు. దాని వల్ల పర్యావరణానికి ఎంతో మేలు చేసినవారమవుతామని తెలిపారు. ఈ దీపావళి పర్వదినాన ఆ లక్ష్మీదేవి కటాక్షవీక్షణలు భారతీయులందరికీ ప్రసరిల్లాలని మనస్పూర్తిగా ఆ దేవుడిని ప్రార్ధిస్తున్నానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
సోము వీర్రాజు, బీజేపీ ఏపి అధ్యక్షుడు
“రాష్ట్ర ప్రజలు అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియ తెలియజేస్తూ, పండుగ కాంతులు మన అందరి జీవితాల్లో తేజస్సును నింపాలని , రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తున్నాను” అంటూ సోము వీర్రాజు ట్వీట్ చేశారు.
రాష్ట్రపతి, ప్రధాని శుభాకాంక్షలు
దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ, ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ వేదికగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. “వెలుగు, ఆనందాలతో నిండే ఈ పవిత్రమైన పర్వదినం రోజున జ్ఞానాన్ని పంచుకుంటూ అందరి జీవితాల్లో సంతోషాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నిద్దాం. దేశ ప్రజలంతా ఆయురారోగ్యాలతో, ఆనందంగా ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్ధిస్తున్నా” అంటూ రాష్ట్రపతి ట్వీట్ చేశారు.