ఏపీ సీఎం వైఎస్ జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్.. ఇద్దరూ మంచి మిత్రులే. మొన్నటి వరకు. ఎప్పుడైతే నీటి పంపకాల సమస్య వచ్చిందో.. ఇద్దరు ముఖ్యమంత్రుల్లో ఎవ్వరూ తగ్గడం లేదు. అది వేరే విషయం అనుకోండి.
ఇక్కడ మనం మాట్లాడుకునేది రాష్ట్రాల మధ్య నెలకొన సమస్యల గురించి కాదు.. జాతీయ రాజకీయాల్లో ఇద్దరి వైఖరులు ఎలా ఉన్నాయి? అనేదే ఇక్కడ చర్చ.
నిజానికి.. బీజేపీతో 2014 తర్వాత నుంచి సీఎం కేసీఆర్ కాస్త సన్నిహితంగానే మెలిగారు. మధ్యలో రెండుమూడు సార్లు ప్రధాని మోదీని కూడా హైదరాబాద్ కు తీసుకొచ్చారు. ఢిల్లీ వెళ్లినప్పుడు కూడా చాలాసార్లు ప్రధానిని కేసీఆర్ కలిశారు. 2019 ఎన్నికల వరకు కూడా ఆయనతో రాసుకుపూసుకు తిరిగిన కేసీఆర్ ఇప్పుడు మాత్రం బీజేపీపై కాస్త దూకుడుగానే వ్యవహరిస్తున్నారు. బీజేపీ పార్టీ తెలంగాణకు చేసిందేమీ లేదు. కేంద్రంలో అధికారంలో ఉండి కూడా తెలంగాణకు అన్యాయం చేస్తోందంటూ ఆరోపణలు చేస్తున్నారు.
మరోవైపు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. కొత్త సీఎం. కేంద్రంతో దోస్తీ చేస్తున్నారు. బీజేపీ ఏది చెబితే అది చేసేస్తున్నారు జగన్. బీజేపీ నేతలు ఇది చేయండి.. అని చెబితే చాలు జగన్ దాన్న అమలు చేసి చూపిస్తున్నారు.
ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే… తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర ప్రభుత్వం మీద ఒక్కొక్కరు ఒక్కో వైఖరితో ఎందుకు ఉన్నారు అనేదే అసలు ప్రశ్న.
బీజేపీతో గతంలో మంచిగానే ఉండి.. ఇప్పుడు మాత్రం ఎందుకు కేసీఆర్ కస్సుబుస్సు అంటున్నారు. దాని వెనుక ఏదైనా రాజకీయ కోణం ఉందా అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఏపీ ముఖ్యమంత్రి బీజేపీ ఏది చెబితే అది చేయడానికి కారణం ఏంటి.. ఆత్మరక్షణ కోసమా? అనే ప్రశ్న ఇటు తలెత్తుతోంది.
నిజానికి తెలంగాణలో తమకు ప్రత్యర్థి అంటే ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని ఇన్నిరోజులు టీఆర్ఎస్ నేతలు అనుకున్నారు. కేసీఆర్ కూడా అదే అనుకున్నారు. కానీ.. రోజురోజుకూ బీజేపీ పార్టీ తెలంగాణలో పుంజుకుంటోంది. ఆ విషయం 2019 ఎన్నికలతోనే తెలిసిపోయింది. బీజేపీ తెలంగాణలో ఎంపీ సీట్లను గెలుచుకోవడంతో.. కేసీఆర్ కు దడ మొదలైందనే వార్తలు వినవస్తున్నాయి. ఎలాగైనా 2023 ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రావాలన్న లక్ష్యంతో బీజేపీ పనిచేస్తుండటంతో.. వీళ్లు తమకు ఎక్కడ ఎసరు పెడతారో అని.. కేసీఆర్ బీజేపీ మీద దూకుడుతనంతో ఉన్నారు. అందుకే.. కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన వాటాలపై తెలంగాణ ప్రభుత్వం ఏమాత్రం తగ్గడం లేదు. ఢీ అంటే ఢీ అంటూ కయ్యానికి కాలు దువ్వుతున్నారు కేసీఆర్.
ప్రస్తుతం ఏపీ ఆర్థిక సంక్షోభంలో ఉంది. మరోవైపు సీఎం జగన్ కు తనను తాను కాపాడుకోవడం మరో చాలెంజ్. అందుకే.. కాస్తో కూస్తో బీజేపీతో దోస్తీ చేస్తేనే మనం సేఫ్ జోన్ లో ఉంటాం.. అని అనుకుంటున్నారంటూ తెలుస్తోంది. ఆనేపథ్యంలోనే బీజేపీకి సై అంటున్నారని వార్తలు వస్తున్నాయి.
అయితే.. తెలంగాణతో పాటుగా ఏపీలో కూడా పాగా వేయాలన్నది బీజేపీ లక్ష్యం. నార్త్ లో పర్వాలేదు కానీ.. సౌత్ లోనే బీజేపీకి డిపాజిట్లు కూడా దక్కడం లేదు. ఒక్క కర్ణాటకలో తప్పితే మరే సౌత్ రాష్ట్రంలో బీజేపీ పార్టీ ఊసే లేదు. అందుకే.. ముందుగా తెలంగాణ, ఏపీలో పాగా వేస్తే తర్వాత మిగిలిన సౌత్ రాష్ట్రాలను టార్గెట్ చేయొచ్చన్న ధీమాతో బీజేపీ ఉన్నట్టు సమాచారం.