ప్రజారోగ్యం అనేది జీవనానికి అతి ముఖ్యమైనది. పరిపాలనలో కూడా సింహభాగం పోషించేది ప్రజారోగ్యమే. ప్రభుత్వాలు కూడా అనేక లక్షలాది కోట్ల నిధులను ప్రజా ఆరోగ్యం కోసమే వినియోగిస్తుంటాయి. ఎన్ని పథకాలు ఇచ్చినా, సంక్షేమ పథకాలు అమలు చేసినా సరే ప్రజల ఆరోగ్యం గురించి సరైన పథకాలు ఉంటేనే ప్రజలు పట్టించుకుంటారు. మళ్ళీ ఎలక్షన్ లో పట్టం కడతారు. 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గెలిచిన తర్వాత మళ్లీ పట్టం కట్టడానికి, వైఎస్ఆర్ ను ఇప్పటికీ కూడా కొన్ని వర్గాల్లో దేవుడుగా కొలవడానికి కారణం ఆయన అమలు చేసిన ఆరోగ్య పథకాలే. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది 108, ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు. అప్పటి వరకు ఆపదలో ఉన్న వారికి అంబులెన్సు ఒకటి ఉచితంగా వస్తుందని, దగ్గరలోని ఆసుపత్రికి తీసుకు వెళుతుందని, సకాలంలో వైద్యం అందించి ప్రాణాలు నిలబెడుతుంది ఏ ఒక్కరూ ఉహించి ఉండరు. కానీ ఇటువంటి అద్భుతమైన పథకానికి వైఎస్ఆర్ అంకురార్పణ చేశారు. ఆయన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి చంద్రబాబు నాయుడు ముఖ్య మంత్రులు అయిన తర్వాత ఈ పథకాన్ని 108ని మూలకు చేర్చారు. సరిగా నిర్వహణ లేక, నిధులు కేటాయింపు లేక, అవినీతి ఆరోపణలు రకరకాల నిర్వహణ ఖర్చుల పేరిట పక్కన పెట్టేసి నిధులు మళ్లించి పూర్తిగా నిర్వీర్యం చేశారు.
వైఎస్ రాజశేఖరెడ్డి తరువాత ఆయన తనయుడుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అదే బాటలో పయనించే ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని ఆరోపణలు, కొన్ని అవినీతి మరకలు జగన్ పై ఉన్నప్పటికీ.. ఆరోగ్య పథకాల విషయంలో మాత్రం తండ్రినే ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. దానికి ముఖ్య ఉదాహరణ 108. జగన్ అధికారం చేపట్టి సంవత్సరం అయిన తర్వాత 108 వాహనాలను పూర్తిగా ఆధునీకరించి తాజాగా రేపటి నుంచి కొత్త వాహనాలు అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఆ వాహనాల్లో ఏమేమి ఉంటాయి అనేది ఇప్పుడు అత్యంత ప్రత్యేకమైన అంశంగా మారింది. 108, 104 సర్వీసులలో ఏమి ఏమి ఉంటాయి అనేది మీరు తెలుసుకోండి.
108 అంబులెన్సులలో…
బీఎల్ఎస్ అంబులెన్సులలో స్పైన్ బోర్డు, స్కూప్ స్ట్రెచర్, వీల్ ఛైర్, బ్యాగ్ మస్క్, మల్టీ పారా మానిటర్ వంటి సదుపాయాలు ఏర్పాటు చేయగా, ఏఎల్ఎస్ అంబులెన్సులలో విషమ పరిస్థితిలో ఉన్న రోగిని ఆస్పత్రికి తరలించే సమయంలో కూడా వైద్య సేవలందించేలా అత్యాధునిక వెంటిలేటర్లు ఏర్పాటు చేశారు. ఇక నియోనేటల్ అంబులెన్సులలో ఇన్క్యుబేటర్లతో పాటు, వెంటిలేటర్లను కూడా అమర్చారు.
ఎంఎంయూ(104)ల్లో సదుపాయాలు..
ప్రతి మొబైల్ మెడికల్ యూనిట్ (ఎంఎంయూ)లో ఒక వైద్య అధికారి, డేటా ఎంట్రీ ఆపరేటర్, డ్రైవర్, ఏఎన్ఎంతో పాటు, ఆశా వర్కర్ ఉంటారు. గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ)తో అనుసంధానమై పని చేసే ఎంఎంయూలు, ఇక నుంచి మారుమూల కుగ్రామాలలో సైతం శరవేగంగా వైద్య సేవలందించనున్నాయి. రోగులకు అప్పటికప్పుడు అవసరమైన వైద్య పరీక్షలు చేసే సదుపాయాలు కూడా ఎంఎంయూలలో ఏర్పాటు చేశారు. రోగులకు అవసరమైన మందులను ఉచితంగా అందజేస్తారు. ప్రతి ఎంఎంయూలో ఆటోమేటిక్ వెహికిల్ లొకేషన్ టాండ్ (ఏవీఎల్టీ)తో పాటు, గ్లోబల్ పొజిషనింగ్ విధానం (జీపీఎస్) కూడా ఏర్పాటు చేశారు. ఆధార్ కోసం బయోమెట్రిక్ ఉపకరణాలు, ఇంకా రోగులకు సంబంధించిన డేటాను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అప్డేట్ చేయడం కోసం ట్యాబ్, పర్సనల్ కంప్యూటర్ (పీసీ) కూడా ఎంఎంయూలలో ఏర్పాటు చేశారు. తద్వారా రోగులకు సంబంధించి ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డు (ఈహెచ్ఆర్) తయారు చేస్తారు.
20 రకాల సేవలు..
మాతా శిశు మరణాలు నివారించడంతో పాటు, చిన్నారుల ఆరోగ్యం కాపాడడం, వారిలో పౌష్టికాహార లోపం లేకుండా చూడడం, ఏజెన్సీ ప్రాంతాల్లో కొన్ని సీజన్ లో ప్రబలే అంటు వ్యాధులు నివారించడం, కుగ్రామాలలో నివసించే వారికి కూడా అత్యాధునిక వైద్య సదుపాయం కల్పిస్తూ, మొత్తం 20 రకాల సేవలందించడం కోసం 104 సర్వీసుల్లో సమూల మార్పులు చేశారు.